ప్రేమించుకున్న కజిన్స్, పెళ్లికి పెద్దలు నో: ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బవాన ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పదో తరగతిలోనే ప్రేమ: అయిదు నెలల కిందట అదృశ్యం.. బావిలో మృతదేహంగా.. !
పరిచయం ప్రేమగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కోట ప్రాంతానికి చెందిన 21ఏళ్ల యువకుడు ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు ఢిల్లీకి వచ్చాడు. తన బంధువుల ఇంటికి వెళ్లేవాడు. అక్కడే తన కజిన్ అయిన యువతితో పరిచయం ఏర్పడింది. తరచూ వస్తూ పోతుండటంతో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ప్రేమా? అంటూ పెద్దల షాక్..
ఈ క్రమంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్నారు. అయితే, వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి అంతా షాకయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించలేదు. మీరిద్దరూ పెళ్లి ఎలా చేసుకుంటారు? అంటూ ప్రశ్నించారు. దీంతో డిసెంబర్ మొదటి వారంలో ఈ ప్రేమ జంట లేచిపోయి పెళ్లి చేసుకుందామని వెళ్లిపోయింది. అయితే, వీరిని కుటుంబసభ్యులు పట్టుకున్నారు.
కలిసి జీవించలేమని..
ఆ తర్వాత ఈ ప్రేమ జంటను కలవనీయకుండా ఇరు కుటుంబాలవారు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రేమించికున్న ఈ యువతీయువకులు తమ బంధాన్ని తెంచుకోలేకపోయారు. కలిసి జీవించడానికి అంగీకరించకపోవడంతో కలిసి మరణించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతీ యువకులు ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి వీరిద్దరూ విగతజీవులుగా కనిపించారు. దీంతో ఇరు కుటుంబాల్లోనే విషాద ఛాయలు అలుముకున్నాయి.
పెద్దలు పరువు, ప్రతిష్టల గురించే..
తమ ప్రేమ పెళ్లిను పెద్దలు అంగీకరించకపోవడం వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని యువతీయువకుడు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులు పరువు, ప్రతిష్టాల గురించే ఆలోచిస్తున్నారని.. తమ గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. ఆ లేఖపై ఇద్దరు కూడా సంతకాలు కూడా చేశారు. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.