కోవాగ్జిన్ మూడో దశ ఫలితాలు: 81శాతం సామర్థ్యమని భారత్ బయోటెక్ వెల్లడి
హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తన కరోనా నిరోధక వ్యాక్సిన్ కోవాగ్జిన్కు సంబంధించి మరో సానుకూల కబురు తెలిపింది. కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బుధవారం ప్రకటించింది. వైరస్ నివారించడంలో తాము అభివృద్ధి చేసిన మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 81 శాతంగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Recommended Video
సుమారు 25,800 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ దశలో ఫలితాలు గతంలో పోలిస్తే మెరుగైనట్లు తెలిపింది. దేశంలో అత్యవసర వినియోగం కింద ఇప్పటికే కోవాగ్జిన్ ను ప్రజలకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మరింత సమాచారం కోసం, కోవాగ్జిన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు టీకాపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇప్పుడు మరింత కీలకమైందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. దేశంలోనే అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని ఆయన తెలిపారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వేగంగా వ్యాపిస్తున్న కరోనా ఉత్పరివర్తనాలకు వ్యతిరేకంగా కూడా కోవాగ్జిన్ గణనీయమైన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుందని కృష్ణ తెలిపారు. యూకే రకం కరోనావైరస్పైనా కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్పై వచ్చే వారం నుంచి క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.
కాగా, మనదేశంలో కోవాగ్జిన్ తోపాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సంస్థలు మనదేశంలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ తో కలిసి ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ అత్యవసరంగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. కోవిషీల్డ్ సామర్థం 70 శాతంగా ఉండగా, ప్రస్తుతం కోవాగ్జిన్ సామర్థ్యం 81 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 16 నుంచి తొలి దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, మార్చి 1న ప్రారంభమైన రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది.