కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. ఢిల్లీపై అమిత్ షా ఫోకస్.. మళ్లీ లాక్ డౌన్ పై 17న నిర్ణయం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ, సైంటిస్టులు, డాక్టర్ల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 79లక్షలకు చేరగా, వైరస్ కాటుకు చనిపోయినవారి సంఖ్య 4.3లక్షలు దాటింది. కొత్త కేసులకు సంబంధించి ఇటు భారత్ లో మరో రికార్డు నమోదైంది. దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. వైరస్ కట్టడికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవీ తాజా లెక్కలు..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 11,929 మందికి వైరస్ సోకగా, 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3.21లక్షలకు పెరిగినట్లయింది. అదే సమయంలో మొత్తం మరణాల సంఖ్య 9,195కు చేరింది. ఇప్పటిదాకా 1,62,379 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,49,348గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఢిల్లీపై కీలక నిర్ణయాలు..
దేశరాజధానిలో కరోనా భయంకరంగా విజృభిస్తుండటం, వైరస్ కట్టడిలో సీఎం కేజ్రీవాల్ దారుణంగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనీల్ బైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియాసహా పలు శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టెస్టులు మూడింతలు.. ప్రతి ఇంటికీ డాక్టర్లు..
ఢిల్లీలో ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగుతోన్న ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతోన్న కొవిడ్-19 టెస్టుల సంఖ్యను మూడింతలు పెంచాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఆయా జోన్లలోని ప్రతి ఇంటినీ డాక్టర్ల బృందం సందర్శించాలని సూచించారు. రాబోయే ఆరు రోజుల్లో అన్ని కంటైన్మెంట్ జోన్లు కవర్ అయ్యేలా అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన కదలాలని చెప్పారు. జూలై చివరినాటికి ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5.5 లక్షలకు పెరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆమేరకు ఆస్పత్రుల్లో ఏర్పాట్లపైనా షా కీలక సూచనలు చేశారు.
రంగంలోకి జాయింట్ టీమ్స్..
ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం అత్యవసరంగా 20 వేల అదనపు బెడ్లను వారంలోపే అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైతే హోటళ్లు, బ్యాంకెట్ హాళ్లను సైతం తాత్కాలికంగా ఆస్పత్రులుగా మార్చుకుంటామని ఆరోగ్య శాఖ అధికారులు అమిత్ షాకు వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు డాక్టర్ల జాయింట్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి ప్రకటించారు. అందులో కేంద్ర ఆరోగ్య శాఖ, ఢిల్లీ ఆరోగ్య శాఖ, ఎయిమ్స్ కు చెందిన డాక్టర్లతోపాటు ఢిల్లీ మున్సిపల్ ఆస్పత్రుల డాక్టర్లు కూడా సభ్యులుగా ఉంటారని చెప్పారు. శుక్రవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ.. ఢిల్లీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన దరిమిలా అమిత్ షా ఈమేరకు రంగంలోకి దిగారు.
Recommended Video
మరోసారి సీఎంలతో పీఎం..
నాలుగు దశల లాక్ డౌన్ తర్వాత కూడా దేశంలో వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాకపోవడం, అన్ లాక్ 1.0 తర్వాత కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం, వైరస్ బాధిత దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకడం అందరినీ కలవరపెడుతున్నది. శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్లు చేశారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనైనా మళ్లీ లాక్ డౌన్ విధించాలన్న వాదనకు రోజురోజుకూ బలం పెరుగుతోన్న నేపథ్యంలో ఈ నెల 16, 17వ తేదీల్లో సీఎంలతో ప్రధాని మరోసారి భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఆ సమావేశంలో అత్యంత కీలకమైన, కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ వార్తలను కొట్టిపారేస్తూ వచ్చిన కేంద్రం.. సీఎంలతో భేటీ తర్వాత ఎలాంటి అడుగు వేయబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.