కరోనా వ్యాక్సిన్: 2వరోజు 17,072 మందికి టీకాలు -మొత్తం 2.07లక్షలు -డ్రైవ్లో ఇండియానే టాప్
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా, సజావుగా సాగిపోతున్నది. వ్యాక్సినేషన్ డ్రైవ్ రెండోరోజైన ఆదివారం కూడా దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ కొనసాగింది. టీకా లెక్కలను వెల్లడించిన కేంద్రం.. దేశం సాధించిన మరో ఘనతను కూడా వెల్లడించింది.
వ్యాక్సికేషన్ డ్రైవ్లో భారత్ టాప్లో నిలిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో పోల్చితే దేశంలో తొలి రోజు అత్యధిక మంది టీకా వేయించుకున్నారని పేర్కొంది. శనివారం దేశవ్యాప్తంగా 2,07,229 మందికి కరోనా టీకాలు వేశారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో తొలి రోజు టీకా వేయించుకున్న వారి సంఖ్య కంటే ఇది అత్యధికమని కేంద్రం పేర్కొంది. మరోవైపు..
వ్యాక్సినేషన్ డ్రైవర్ రెండో రోజైన ఆదివారం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే టీకా కార్యక్రమం కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ తెలిపారు. రెండో రోజున దేశవ్యాప్తంగా 553 కేంద్రాల్లో 17,072 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,24,301 మంది కరోనా టీకా వేయించుకున్నారని వెల్లడించారు. కాగా..
శని, ఆదివారాల్లో టీకా వేయించుకున్న 447మందిలో స్వల్ప ప్రతికూలతలు కనపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో చాలా వరకు జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయని పేర్కొంది. ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, చికిత్స అనంతరం ఢిల్లీలో ఇద్దరు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఎయిమ్స్ రిషికేశ్లో ఒకరు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా టీకాకు 47 శాతం మంది డుమ్మాకొట్టారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. రిజిస్టర్ చేయించుకున్నవారిలో చాలా మంది వివిధ కారణాలతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారని మంత్రి చెప్పారు. తొలి రోజు టీకా కోసం నమోదు చేసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 4,319 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని వివరించారు. సుమారు 53 శాతం టీకా కోసం ముందుకు రాగా 47 శాతం మంది రాలేదని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిగా ఐచ్చికం కాబట్టి ఎవరినీ బలవంతపెట్టబోమని జైన్ అన్నారు.