దేశంలో కరోనా: సెకండ్ వేవ్ భయాలు -కొత్తగా 18,645 కేసులు, 201 మరణాలు -16నుంచే వ్యాక్సినేషన్ షురూ
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కాస్త అదుపులోకి వచ్చింది. కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్య 20వేల లోపే నమోదవుతోంది. కానీ ఇది తుపానుకు ముందు ప్రశాంత లాంటిది కావొచ్చని, సెకండ్ వేవ్ ముంచెత్తడానికి ముందు పలు దేశాల్లోనూ ఇదే రకంగా కొత్త కేసులు తగ్గాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసిన కేంద్రం.. ఈనెల 16 నుంచే టీకాలను అందించేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ప్రకటించిన బులిటెన్ వివరాల్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 18,645 కేసులు, 201 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1,04,50,284కు, మరణాల సంఖ్య 1,50,999కి పెరిగింది. ఇండియాలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది.
కొత్త కేసులు తగ్గడంతోపాటు రికవరీలు కూడా భారీగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే 19,299 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం రికవరీల సంఖ్య 1కోటి 75వేలు దాటింది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మెరుగ్గా భారత్ లో రికవరీ రేటు 96.4 శాతంగా ఉంది. కొత్త కేసులు తగ్గి, రికవరీలు పెరగడం ద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2.23 లక్షలకు పడిపోయింది.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8.43 లక్షల టెస్టులు జరిగాయని, ఇప్పటిదాకా మొత్తం టెస్టుల సంఖ్య 18.10 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తన బులిటెన్ లో పేర్కొంది. కొత్త కేసులు వరుసగా మూడో రోజు 20వేల కంటే తగ్గాయి. మరణాలు కూడా వరుసగా 4వ రోజు 250 కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం 7 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే... కొత్త మరణాలు డబుల్ సంఖ్యలో ఉంటున్నాయి. ఐతే... దేశంలో మొన్న పాజిటివిటీ రేటు 1.99 శాతం ఉండగా... నిన్న అది పెరిగి 2.2 శాతానికి చేరింది. ఇక..
కరోనా టీకా కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కానుంది. దేశంలో కరోనా వ్యాప్తి స్థితిగతులపై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈనెల రెండోవారంలో జరగనున్న లోహ్రి, మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు మొదలైన పర్వదినాలు పూర్తయిన వెంటనే టీకా పంపిణీకి శ్రీకారం చుట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. టీకా కార్యక్రమం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధతపైనా సమీక్షించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.