కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. భారీగా మరణాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్..
అంచనాలు తలకిందులయ్యాయి.. రికవరీ రేటు అధికంగా ఉండటం ఊరటే అయినా కొత్త కేసులు వెల్లువలా పెరుగుతున్నాయి.. వెరసి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగానే కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,850వేల కొత్త కేసులు, 613 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6.76లక్షలకు, మరణాల సంఖ్య 19,268కు పెరిగింది. కొవిడ్ వ్యాధి నుంచి ఇప్పటికే 4లక్షల పైచిలుకుమంది కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య రెండున్నర లక్షలుగా ఉంది.
షాకింగ్: పోలీస్ శాఖలో ఇంటి దొంగలు.. గ్యాగ్స్టర్ వివేక్ దుబేకు ఉప్పందించడం వల్లే కాన్పూర్ ఎన్కౌంటర్
అతిపెద్ద కొవిడ్ సెంటర్..
ప్రపంచంలోనే అదిపెద్ద కొవిడ్ సెంటర్ గా గుర్తింపు పొందిన ‘‘సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్''లో ఆదివారం నుంచి సేవలు మొదలయ్యాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గర్నర్ అనిల్ బైజల్ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఛత్తర్పూర్లో 70ఎకరాల విస్తీర్ణంలో, 10వేల బెడ్స్ తో ఏర్పాటైన ఈ సెంటర్ ను ఐటీబీపీ నిర్వహిస్తున్నది. రాధా సోమి బియాస్ ఆధ్యాత్మిక సంస్థ వాళ్లు కూడా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. ఐటీబీపీ, ఇతర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 1,000 మందికి పైగా డాక్టర్లు, 2,000 మంది వైద్య, సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ సేవలు అందిస్తున్నారు. క్రిటికల్ కేసులతోపాటు స్వల్ప లక్షణాలున్నవారికి కూడా ఇక్కడ చికిత్స అందించనున్నారు.
డీఆర్డీవో ఆస్పత్రికి అమిత్ షా, రాజ్నాథ్..
ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్ తోపాటు ఢిల్లీలో మరో కీలకమైన ఆస్పత్రి కూడా అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మించిన 1000 పడకల ఆస్పత్రిని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఆదివారం సందర్శించారు. వారి వెంట కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా వెళ్లారు. ఇక్కడి 1000 బెడ్లలో 250 ఐసీయూ వార్డుకి చెందినవి కావడం గమనార్హం. ఢిల్లీపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కేంద్రం.. ఈ మేరకు కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయడం పట్ల సీఎం కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో 2లక్షలు.. పుణె మేయర్కు పాజిటివ్..
దేశరాజధాని ఢిల్లీలో ఒకటి తర్వాత మరోటి భారీ ఆస్పత్రులు తెరుచుకుంటుండగా.. ఆర్థిక రాజధాని ముంబైలో మాత్రం పరిస్థితి అంతకంతకూ ప్రమాదకరంగా మారుతోంది. ముంబైలో శనివారం ఒక్కరోజే 1180 కొత్త కేసులు వచ్చాయి. సిటీలో మొత్తం కేసుల సంఖ్య 83వేలుగా ఉంది. మహారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో ఏకంగా 7,074 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల మార్కు దాటి 2,00,064కు చేరుకుంది. పుణె మేయర్ మురళీధర్ మోహాల్ కు కూడా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
Recommended Video
వ్యాక్సిన్ గడువుపై వివాదం..
కరోనా వైరస్ కు విరుగుడు మందుగా హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ తీసుకురానున్న ‘కొవ్యాక్సిన్' గడువుపై వివాదం కొనసాగుతున్నది. ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ సహకారంతో భారత్ బయోటెక్ రూపొందించిన ‘కొవ్యాక్సిన్'కు గత వారమే క్లినికల్(హ్యూమన్) ట్రయల్స్ అనుమతి లభించడం తెలిసిందే. అయితే ఆగస్టు 15లోగా పరిశోధనలు పూర్తిచేసి, ఆ వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తేవాలంటూ ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ్.. బయోటెక్ కంపెనీకి లేఖ రాయడం సంచలనం రేపింది. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట పైనుంచి చేసే ప్రసంగంలో వ్యాక్సిన్ విడుదలను ప్రకటించేలా, తద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు కంపెనీపై ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై వివాదం చెలరేగడంతో.. తమ ఉద్దేశం అదికాదని, వ్యాక్సిన్ తయారీలో తొందరపాటుకు తావు ఇవ్వబోమని వివరణ ఇచ్చింది.