కర్ణాటక - ఆంధ్రా బస్సు సర్వీసులకు బ్రేక్.. బెంగళూరులో మళ్లీ పూర్తి లాక్ డౌన్..
లాక్ డౌన్ సడలింపుల్లో దూకుడుగా వ్యవహరించి, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా నడిపిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించడం, ప్రధాన నగరమైన బెంగళూరులోనూ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో మళ్లీ నిషేధాలవైపు మళ్లింది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి నడుస్తోన్న అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు బ్రేకులు వేసింది.
Recommended Video
ఎంపీ రఘురామ బాటలో ఎమ్మెల్యే ఆనం?.. వైసీపీలో సెల్ఫీ కలకలం.. సింహపురి ఎక్స్ప్రెస్ కొత్త ఎత్తులు..
కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ నెల 15 నుంచి 23 వరకు మొత్తం 120 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో కర్నాటకలో లాక్డౌన్ అమలు చేయనుండటంతో అంతర్రాష్ట్ర సర్వీసులలు తాత్కాలికంగా నిలిపేయాలని కేఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం వెలవడుతుంది. 23న మరోసారి సమీక్ష జరిపి, తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
కేసుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో బెంగళూరు సిటీ, సబర్బన్ ప్రాంతాల్లో ఈ నెల 14(మంగళవారం) నుంచి 23 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన చేసింది. 14న రాత్రి 8 గంటల నుంచి లాక్ డౌన్ పున:ప్రారంభమవుతుందని, అత్యవసర సేవలు తప్ప మిగతా వాటిని అనుమతించబోమని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ అమలుకాగా.. మూడు నెలల తర్వాత.. జూన్ 17 నుంచి ఆంధ్రా, కర్ణాటక మధ్య బస్సు సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. విడతల వారీగా సర్వీసులు పెంచుతూ కేఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలు ముందుకెళ్లాయి. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో కర్నాటక సర్కారు మళ్ళీ లాక్ డౌన్ విధించడంతో ఇప్పుడవి మళ్లీ నిలిచిపోనున్నాయి.