కరోనా వేళ షాకింగ్ బిజినెస్ - వాడి పారేసిన గ్లవ్స్ మళ్లీ అమ్మకం - ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా?
ఇప్పటికే ఎనిమిది లక్షల మందిని పొట్టన పెట్టుకుంది.. ఇన్ఫెక్షన్ల సంఖ్య 2.3కోట్లకు చేరువైంది.. భూగోళంపై మరికొన్ని దశాబ్దాలు ఉండబోతున్న కరోనా మహమ్మారి.. దాదాపు అందరి జీవితాలను మార్చేసింది.. బతికుంటే అదే పదివేలనే స్థితికి చేర్చింది.. అయితే ఇంత దారుణమైన పరిస్థితుల్లోనూ కొందరు చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.. మోసాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న నేరస్తులు.. కరోనా విలయంలోనూ యధేచ్ఛగా దందాలు నిర్వహిస్తున్నారు.. టన్నుల కొద్దీ నకిలీ సర్జికల్ గ్లవ్స్, మాస్కులను మార్కెట్ లోకి వదులుతున్నారు. ప్రాంతం ఏదైనప్పటికీ ప్రాణం విలువ తెలిసిన పౌరులుగా మనకు మనం జాగ్రత్త వహించాలని గుర్తుచేసే కథనమిది..
శ్రీశైలం ఘోర విషాదం: భయపడ్డట్లే - ఆరుగురి మృతదేహాలు లభ్యం - చాన్స్ ఉందా? కేసీఆర్ కీలక ఆదేశాలు
వాడిపారేసిన గ్లవ్స్ తో వ్యాపారం..
కరోనా మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత మాస్క్ దాదాపు ఓ శరీరభాగమైపోయింది. అలాగే సర్జికల్ గ్లవ్స్ వాడుతోన్న వాళ్ల సంఖ్యా తక్కువేమీకాదు. కరోనా వారియర్స్ గా పిలవబడే డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు కోట్ల సంఖ్యలో సాధారణ ప్రజలూ గ్లవ్స్ వాడుతున్నారు. ఓవైపు కరోనా నియంత్రణకు కొందరు ఇన్నోవేటివ్ ఐడియాలు రూపొందిస్తుంటే.. మరికొందరు మాత్రం విలయకాలాన్ని అవకాశంగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాడి పారేసిన గ్లవ్స్ ను నీళ్లలో కడిగి, మళ్లీ వాటితోనే వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం వెలుగు చూసిన ఓ ఘటన కరోనా నకిలీలలకు నిదర్శనంగా నిలిచింది.
మూడు టన్నుల సరుకు పట్టివేత..
నవీ ముంబైలోని ‘మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్' ఏరియాలో నకిలీ గ్లవ్స్ ముఠా గుట్టు రట్టయింది. పలు ఫిర్యాదుల తర్వాత నకిలీ మాఫియాపై నిఘా పెంచిన పోలీసులు.. శుక్రవారం పావ్నే ప్రాంతంలోని ఇండస్ట్రియల్ సముదాయాలపై దాడులు చేశారు. సదరు ముఠా.. వాడిపారేసిన గ్లవ్స్ సేకరించి, వాటిని కడిగి, మళ్లీ కొత్తవాటిలా విక్రయిస్తున్నదని పోలీసులు చెప్పారు. మార్కెట్ కు తరలించడానికి సిద్ధంగా ఉన్న మూడు టన్నుల గ్లవ్స్ పట్టుపట్టాడని, అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని, దీని వెనుక ఎవరున్నారనేది కనిపెడతామని క్రైమ్ బ్రాంచ్ విభాగం పేర్కొంది.
లక్షల్లో నకిలీ మాస్కులు..
వాడిన గ్లవ్స్ ను తిరిగి అమ్ముతోన్న ముఠా పట్టుపడటానికి మూడు వారాల ముందు, ఇదే ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త నుంచి సుమారు రూ.21లక్షల విలువైన నకిలీ మాస్కులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఎన్ -95, వీ-410వీ మాస్కులు సహా నకిలీ పీపీఈ కిట్లను ఒరిజినల్విగా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మొహమ్మద్ జాఫర్ మోమిన్ అనే 42 ఏండ్ల వ్యాపారిని అసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు బెంగళూరు సిటీలోని ఓ గోడౌన్ లోనూ వేల కొద్దీ నకిలీ మాస్కులు పట్టుపడ్డాయి. గడిచిన ఐదు నెలల కాలంలో దేశవ్యాప్తంగా లక్షల్లో నకిలీ మస్కులు, పీపీఈ కిట్లను ఆయా రాష్ట్రాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గ్లవ్స్, మాస్కుల ఇలా పారేయాలి..
కరోనా పేషెంట్లుగానీ, కరోనా వారియర్లుగానీ వాడిన మాస్కులు, గ్లవ్స్, పీపీ కిట్స్ ను ఏలా డిస్పోజ్ చేయాలనేదానిపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా నకిలీ ఘటనల నేపథ్యంలో వాటిని మరోసారి పరిశీలిద్దాం.. కొవిడ్ పేషెంట్లుగానీ, మామూలు, ఆరోగ్యవంతులైన వ్యక్తులుగానీ వాడిన గ్లవ్స్, మాస్కులను సైతం నేరుగా చెత్తబుట్టల్లో పారేయకూడదు. వాటిని కాగితం కవర్లలో వేసి మూడు రోజులపాటు విడిగా ఉంచి, ఆ తర్వాత ముక్కలుగా చేసి (మళ్లీ ఎవరూ వాడకుండా) అప్పుడు వాటిని ఘనవ్యర్థాలు వేసే చెత్తబుట్టలో వేయాలి. మాల్స్, ఆఫీసులు సహా అన్ని చోట్లా ఇదే పద్ధతిని పాటించాలి. కొవిడ్ పేషెంట్ల బయోమెడికల్ వ్యర్థాలను బ్యాగుల్లోనే వేసి గట్టిగా బిగించి, వాటిపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ర్పే చేసి, అప్పుడు చెత్తబుట్టలో వేయాలి. కొవిడ్ పేషెంట్లు వాడినవాటిలో తడి వ్యర్థాలను కంపోస్టబుల్ బ్యాగుల్లో వేయాలి. కొవిడ్-19 వ్యర్థాల సేకరణకు విడిగా ప్రత్యేకమైన చెత్తబుట్ట వాడాలి. అందులో రెండు లేయర్లు ఉన్న సంచులు అమర్చి.. వ్యర్థాలను వేయాలి.