నిన్న జొమాటో.. నేడు స్విగ్గీ: 1100మంది ఉద్యోగులను తొలగించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ
న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృభిస్తుండటంలో ఇటు జనజీవనం స్తంభించడమే కాకుండా అటు ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ అమలులోకి రావడంతో దేశంలో ప్రధాన రంగాలు నష్టాల బాట పట్టాయి. అదే సమయంలో చాలా ప్రైవేట్ ప్రభుత్వ కంపెనీలు కూడా నష్టాలు చవిచూశాయి. ఇదిలా ఉంటే కరోనావైరస్ కారణంగా ఇప్పటికే పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితం జొమాటోలో ఉద్యోగులను తొలగించిన ఘటన మరువక ముందే మరో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తన ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.
స్విగ్గీలో 1100 మంది ఉద్యోగస్తులకు గుడ్బై
కరోనావైరస్ సంక్షోభం ఫుడ్ డెలివరీ సంస్థలపై భారీగా ప్రభావం చూపుతోంది. యాప్ ద్వారా ఆర్డరిస్తే చాలు మనకు కావాల్సిన ఆహారం మన డోర్ ముందుకు తీసుకొచ్చి పెట్టే ఆ డెలివరీ సంస్థ ఇప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. లాక్డౌన్ కారణంగా నష్టాల బాట పట్టిన ఫుడ్ డెలివరీ యాప్స్ ఇక తమ సిబ్బందిని తొలగించే బాట పట్టాయి. కొద్ది రోజుల క్రితం జొమాటో తన ఉద్యోగస్తులను తొలగించగా... తాజాగా అదే దారి పట్టింది స్విగ్గీ. స్విగ్గీలో పనిచేస్తున్న 1100 మంది ఉద్యోగస్తులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఈ సంఖ్య తమ మొత్తం సిబ్బందిలో 13వశాతంగా ఉంది. ఈ రోజు స్విగ్గీ చరిత్రలో దుర్దినం అని పేర్కొంటూ ఆ సంస్థ సహవ్యవస్థాపకులు మరియు సీఈఓ అయిన శ్రీహర్ష మజేటీ తమ ఉద్యోగస్తులకు మెయిల్ పంపారు. ఇప్పటికే స్విగ్గీ సంస్థ పలు కిచెన్ క్లౌడ్స్ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేయాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం చేశారు.
వారికి అండగా ఉంటామన్న స్విగ్గీ
ఇక స్విగ్గీ నుంచి తొలగించనున్న ఉద్యోగస్తులకు సంస్థ అండగా నిలుస్తుందని చెప్పారు. హెచ్ఆర్ సిబ్బంది తొలగించబడ్డ వారితో టచ్లోకి వస్తారని చెప్పిన సీఈఓ వారిని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఈ కష్టసమయంలో వారికి అండగా ఉండటమే కాకుండా వారి కెరీర్ పరంగా కూడా సహాయం చేస్తారని వెల్లడించారు. ఇక తొలగించబడ్డ ఉద్యోగులకు మూడు నెలల జీతం చెల్లించనున్నట్లు చెప్పారు సీఈఓ. అంతేకాదు దీనికి తోడు.. ఉద్యోగి సంస్థలో చేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరంకు ఒక నెల జీతం అదనంగా ఇవ్వనున్నట్లు స్విగ్గీ తెలిపింది. ఇక డిసెంబర్ 31, 2020 వరకు తొలగించబడుతున్న ఉద్యోగస్తులకు మెడికల్ ఇన్ష్యూరెన్స్ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు
కరోనావైరస్ విజృంభణతో తమ వ్యాపారం భారీగా దెబ్బతినిందని సీఈఓ చెప్పారు. ఇక కరోనావైరస్ తగ్గినప్పటికీ ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడేలా కనిపించడం లేదని చెప్పారు. దీర్ఘకాలంలో కూడా ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు స్విగ్గీ సీఈఓ. ఇక స్విగ్గీ తన వ్యాపార కార్యకలాపాలను తగ్గించడం కానీ లేదా మూసివేయడం కానీ చేసేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. ఇక కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఎక్కువగా స్విగ్గీ కిచెన్ బిజినెస్పై పడిందని చెప్పారు.
ఇక స్విగ్గీ తిరిగి లాభాలు పొందాలంటే కొన్ని ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇక లాక్డౌన్ 4వ దశలోకి ఎంటర్ అయిన నేపథ్యంలో ఇంకా కొన్ని బిజినెస్లకు గడ్డుకాలంగా మారనుంది. ఇలాంటి వాటిలో ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా ఉండటంతో ఆ సంస్థలు ఉద్యోగుల తొలగింపు వైపే దృష్టిసారిస్తున్నారు.