మహారాష్ట్రలో మిషన్ ఆక్సిజన్ ప్రాజెక్ట్కి కేబినెట్ ఆమోదం... లాక్డౌన్ మే 31 వరకు పొడగింపు...
మహారాష్ట్రలో మే 31 వరకు లాక్డౌన్ను పొడగిస్తూ శివసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం(మే 12) జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
లాక్డౌన్ పీరియడ్లో కేవలం అత్యవసర సర్వీసులు మినహా మిగతా వాటికి అనుమతి లేదు. నిత్యావసర వస్తువుల కోసం ప్రతీరోజూ ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అనవసరంగా బయటకు వచ్చేవారికి జరిమానా తప్పదు. అవసరమైతే కేసులు బుక్ చేస్తారు. హోమ్ డెలివరీ సంస్థలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సంస్థలు ఉదయం 7గంటల నుంచి రాత్రి 8గంటల వరకు పనిచేస్తాయి.
తాజా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా లాక్డౌన్తో పాటు 'ఆక్సిజన్' సరఫరాపై చర్చించారు. ఆక్సిజన్ ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించేందుకు మిషన్ ఆక్సిజన్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద మాన్యుఫాక్చరర్స్కు ప్రత్యేక రాయితీలు కల్పించి రాష్ట్రానికి అవసరమయ్యే ఆక్సిజన్ను రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటారు. రోజుకు దాదాపు 3వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 1800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా 1300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెంచుకుని ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది.
Recommended Video
మహారాష్ట్రతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణ,కర్ణాటక అలాగే దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతీరోజూ 3 లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,48,421 కేసులు నమోదవగా మరో 4205 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 37,04,099 కరోనా కేసులు ఉన్నాయి.