ఆక్స్ ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్: కీలక అడుగు-ఇండియాలో ఫేజ్-3 ట్రయల్స్కు కేంద్రం ఓకే-సీరం ఆధ్వర్యంలో
కరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, అతి ఎక్కువగా ఆశలు రేకిత్తిస్తోన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రఖ్యాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కు మంగళవారం ఆమోదం లభించింది.
ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ను ఫేస్-2, ఫేస్-3 హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీరం సంస్థ చేసిన అభ్యర్థనకు.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, భారత్ కు చెందిన సీరం సంస్థలు ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి 'కోవిషీల్డ్' పేరుతో వ్యాక్సిన్ రూపొందించిన సంగతి తెలిసిందే.
కొవిడ్-19 వ్యాక్సిన్ పై గుడ్, బిగ్ న్యూస్ -వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే -భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ''కోవిషీల్డ్' క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి సీరం సమర్పించిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ కు ఆమోదం తెలిపినట్లు డీసీజీఐ ప్రకటించింది. ఇప్పటికే బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లో 'కోవిషీల్డ్' తొలి, మలి దశ ట్రయల్స్ నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. శుక్రవారం నాటి ఆమోదంతో ఇక భారత్ లోనూ 'కోవిషీల్డ్' క్లినికల్ ట్రయల్స్ ఊపందుకోనున్నాయి.
'కోవిషీల్డ్'కు సంబంధించి భారత్ లో చేపట్టబోయే ప్రయోగాలు ప్రధానంగా రోగ నిరోధక శక్తి పెంపుపై సాగుతాయని, ప్రయోగాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ఇప్పటికే 1600 మంది(అందరూ 18 ఏళ్లు పైబడినవారే) పేర్లు నమోదు చేసుకున్నారని సీరం సంస్థ తెలిపింది. ప్రయోగాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే ముందుగా భారత్ సహా తక్కువ ఆదాయం ఉన్న దేశాలకే వ్యాక్సిన్ అందిస్తామని, వంద కోట్ల డోసులు తయారు చేసి, పేదలందరికీ దానికి అందుబాటులోకి తెస్తామని సీరం సంస్థ యజమానులు సైరస్ పునావాలా, సియోన్ పునావాలా ఇటీవల ప్రకటించడం తెలిసిందే.
చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్
Recommended Video
మన దేశంలో ఇప్పటిదాకా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' పేరుతో, జైడస్ కాడిలా సంస్థ 'జైకోవిడ్'పేరుతో కరోనా వ్యాక్సిన్లు రూపొందించాయి. ఈ రెండూ, ఫేజ్-1, ఫేజ్-2 దశల్లో ఉన్నాయి. ఇప్పుడు సీరం సంస్థకు కూడా ఆక్స్ ఫర్డ్ 'కోవిషీల్డ్'కు కూడా అనుమతి లభించడంతో ప్రయోగాలు ఇంకా ఊపందుకోనున్నాయి. 'కొవాగ్జిన్'ను వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే అందిస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. మిగతా వ్యాక్సిన్లు కూడా అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.