450 మందికి ఆరు బాత్రూములు: గల్ఫ్ దేశాల్లో బతుకులు దుర్భరం: సోషల్ డిస్టెన్సింగ్ సాధ్యమా?
న్యూఢిల్లీ: కష్టాన్ని నమ్ముకుని, చేతినిండా డబ్బులు సంపాదించాలని ఆలోచించే ప్రతి కార్మికుడికి గుర్తుకు వచ్చేది గల్ఫ్ కంట్రీస్. పనికి తగ్గ ప్రతిఫలం ఉంటుందనే ఆశతో కుటుంబాలను వదిలేసి ఎడారి దేశాలకు వలస వెళ్తుంటారు వలస కార్మికులు. మౌలిక రంగంలో గల్ప్ దేశాలు ప్రగతి సాధిస్తుండటంతో నిర్మాణ పనులకు ఢోకా ఉండదనే భరోసా ఉంటుంది వారికి. భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్, మలేసియా వంటి ఆసియా దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి వలస కార్మికుల జీవితాలపై దెబ్బ కొట్టింది కరోనా వైరస్.
రైల్వే సంచలన నిర్ణయం: మోడీ ప్రసంగం ముగిసిన వెంటనే వెల్లడి: పాసింజర్ రైళ్లపై..
లాక్డౌన్ వల్ల నిర్మాణ రంగం కుదేల్
సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్, మస్కట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. వంటివి ఎంత ధనిక దేశాలైనప్పటికీ కరోనా వైరస్ దుష్ప్రభావానికి గురి అయ్యాయి. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండటానికి ఆయా దేశాలు కూడా లాక్డౌన్ను ప్రకటించాయి. ఫలితం- నిర్మాణ రంగం స్తంభించింది. ఇన్ఫ్రా సెక్టార్ కుదేలైంది. ఫలితంగా ఈ రెండు రంగాల మీద ఆధారపడిన కార్మికులు దాదాపు రోడ్డున పడాల్సిన దుస్థితి ఎదురైంది. ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక పస్తులు పడుతున్నారు. లాక్డౌన్ వల్ల అడుగు బయట పెట్టలేకపోతున్నారు. ఇరుకు గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
విదేశీయుల వల్లే 50 శాతానికి పైగా..
తమ దేశంలో నివసిస్తోన్న విదేశీయుల వల్లే 50 శాతానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటూ సౌదీ అరేబియా చేసిన ప్రకటన అక్కడి పరిస్థితిని స్పష్టం చేస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియట్లేదు గానీ.. కరోనా వైరస్ ప్రభావం వల్ల విధించిన లాక్డౌన్.. సౌదీ అరేబియా సహా గల్ప్ దేశాల ఆర్థిక రంగాన్ని దెబ్బకొట్టింది. ఆర్థిక వ్యవస్థ మందగించింది. దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా తేలని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో- వలస కార్మికుల బతుకులు దుర్భరం అయ్యాయి. రోజు గడవని దుస్థితిని చేరుకున్నాయి.
వలస కార్మికుల శిబిరాల్లో వైరస్ సోకే ప్రమాదం..
వలస కార్మికులు నివసించే శిబిరాలు, ప్రాంతాల్లో కరోనా వైరస్ మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందంటూ గల్ఫ్ రీసెర్చర్ ఫర్ హ్యూమన్ రైట్స్ వాచ్ హీబా జయాదిన్ తెలిపారు. ఈ మేరకు ఆమె న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఓ కథనాన్ని ప్రచురించారు. భారత్ సహా పలు దేశాల నుంచి జీవనోపాధి కోసం వలస వచ్చిన కార్మికులు అపరిశుభ్ర వాతావరణంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఖతార్లో నివసించే ఓ కెన్యా వలస కార్మికుడిని ఉటంకించారు. 450 మందికి ఆరు బాత్రూమ్లు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్సింగ్ ఎలా సాధ్యపడుతుందని అన్నారు.
గల్ఫ్ దేశాల్లో భారీగా కరోనా కేసులు..
గల్ఫ్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే నమోదవుతున్నాయి. సౌదీ అరేబియా-5000, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- 4,500, ఖతర్-3,500, బహ్రెయిన్-1300, ఒమన్-750కి పైగా కేసులు నమోదు అయ్యాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించాయి. అక్కడి ప్రభుత్వాలు గానీ.. పరిశ్రమల యజమానులు గానీ వలస కార్మికుల కోసం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలను చేపట్టలేదు. వారి మానాన వారిని వదిలేశాయి. ఫలితంగా- ఇరుకిరుకు ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు నివసించాల్సి వస్తోందని హీబా జయాదిన్ తన కథనంలో పేర్కొన్నారు.