కరోనాతో ఆస్పత్రిలో మాజీ సీఎం - ఆయన కొడుకు, ప్రస్తుత సీఎంకూ టెస్టులు..
జార్ఖండ్ ఉద్యమ సారధి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్, మాజీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరారు. తన భార్య రూపా సోరెన్ తోపాటు రాంచీలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. రెండ్రోజుల కిందట శిబు దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి వాళ్లిద్దరూ సోమవారం ఆస్పత్రిలో చేరారు.
రాష్ట్రమంతా 'గురుజీ'గా పిలుచుకునే శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరడంతో జేఎంఎం శ్రేణులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో మేదాంత ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. సోరెన్ దంపతుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బులిటెన్ లో పేర్కొన్నారు.
సోనియా గాంధీకి నెత్తుటి లేఖ - కొత్త అధ్యక్షుడు ఖాయం - 7గంటల సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు
76ఏళ్ల శిబు సోరెన్ రెగ్యులర్ గా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటారని, కరోనా కారణంగా డాక్టర్ల సూచన మేరకు రాంచీలోని మేదాంత బ్రాంచ్ లో చేరారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈనెల 7న సోరెన్ సెక్యూరిటీ బృందంలోని 12 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, శిబు తనయుడు, జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేంత్ సోరెన్ కూడా ముందుజాగ్రత్తగా టెస్టులు చేయించుకోగా, నెగటివ్ అని తేలింది.
కరోనా టెస్టుల పరంగా వెనుబడిన జార్ఖండ్ లో ఇప్పటిదాకా 5.7 లక్షల శాంపిళ్లను మాత్రమే పరీక్షించారు. అక్కడ మొత్తం 30,178 కేసులు నమోదుకాగా, 318 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 20,136 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, దాదాపు 10 వేల యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి వరకు ఇన్ఫెక్షన్ల సంఖ్య 31.55లక్షలకు, మరణా సంఖ్య 58,400కు పెరిగింది. 24 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7లక్షలుగా ఉంది.