కరోనా సెస్: ఇక పేలనున్న పెట్రో బాంబు: లీటర్పై రూ.8 వరకు బాదుడు: కరోనా లోటు భర్తీ కోసం..
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్పై యావత్ దేశం లాక్డౌన్లో కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్ వాతావరణం కనిపిస్తోంది. జనం రోడ్ల మీద నడవడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రజా రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బ్యాంకులు పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ ఒక్క రాష్ట్రంలో క్రియాశీలకంగా లేదు. రాష్ట్రాలన్నీ షుప్త చేతనావస్థకు చేరుకున్నాయి.
అడుగంటిన ఆదాయం..
ఈ పరిస్థితులన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆదాయం స్తంభించిపోయింది. వస్తు, సేవా పన్ను రూపంలో ఖజానాకు చేరాల్సిన రాబడి పూర్తిగా అడుగంటి పోయింది. ఆదివారం విధించిన జనతా కర్ఫ్యూ వల్ల లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కేంద్రం కోల్పోయింది. అదే పరిస్థితి మరి కొద్దిరోజుల పాటు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొనడంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని అంచనాలకు కూడా అందలేకపోవచ్చు.
ఎక్సైజ్ ట్యాక్స్ పెంపునకు వెసలుబాటు..
ఈ గండం నుంచి గట్టెక్కడానికి కేంద్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పెట్రోలు, డీజిల్ రేట్లను భారీగా పెంచుకునే వెసలుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. దీనిపై ఇప్పటికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ద్రవ్యబిల్లులో మార్పులను కూడా ప్రతిపాదించింది. పెట్రోలు, డీజిల్ రేట్లపై లీటర్ ఒక్కింటికి ఎనిమిది రూపాయల వరకు పెంచుకునే వెసలుబాటును కల్పించింది.
లాక్డౌన్ నేపథ్యంలో.. ప్రజలకు నగదు, రేషన్ పంపిణీ..
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్ను ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయ వనరులు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం, అదే సమయంలో ప్రజలకు నగదు, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామంటూ ఏపీ, తెలంగాణ, కేరళ, ఒడిశా సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో.. అదనపు ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవాల్సిన పరిస్థితిని ఏర్పడింది.
Recommended Video
ప్రత్యామ్నాయంగా పెట్రో ఉత్పత్తుల పైనా..
రోజువారీ వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయినప్పటికీ.. పెట్రోలు బంకులు అందుబాటులో ఉన్నాయి. దీనితో వాటి రేట్లను పెంచుకోవచ్చనే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది కేంద్రం. లీటర్ ఒక్కింటికి ఏకంగా ఎనిమిది రూపాయల మేర కరోనా సెస్ను విధించవచ్చని పేర్కొంది. దీనితో ఇక పెట్రోలు బాంబును పేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సమాయాత్తమౌతున్నాయి. ఆర్థిక లోటును భర్తీ చేసుకోవడానికి పెట్రోలు, డీజిల్ రేట్లను గరిష్ఠంగా పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి.