coronavirus alert: covid-19 సమాచారమంటూ పర్సనల్ డేటా దోచేస్తున్నారు!
న్యూయార్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్(కొవిడ్-19) విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 145 దేశాల్లో వ్యాపించి 5500 మందికిపైగా ప్రాణాలను తీసింది. లక్షా50వేల మంది కరోనాబారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆ లింక్ జోలికెలితే..
ఈ క్రమంలో ఏ దేశంలో ఎంత మంది కరోనా బాధితులు ఉన్నారనే విషయం వైరల్గా మారుతోంది. అయితే, దీన్నే అవకాశంగా తీసుకున్నారు కొందరు హ్యాకర్లు. ఇటీవల కరోనా మ్యాప్ అంటూ ఏ ప్రాంతంలో ఎన్ని కేసులు ఉన్నాయో అని ఆన్ లైన్లింక్ ఒకటి వైరల్గా మారింది. ఈ డేటాను షేర్ చేయాలనుకుని దాన్ని ఇతరులకు పంపినా.. అందులో ఏముందో అని క్లిక్ చేసినా.. హ్యాకర్లు వారి ఫోన్లలోని డేటా, ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు.
కీలక సమాచారం దోచేస్తారు..
ఈ కరోనా మ్యాప్ లింక్తో ఒక మాల్వేర్ మన ఫోన్లో చొచ్చుకుని వస్తుందని.. ఆ తర్వాత మన డేటాను దోచేస్తుందనిసెక్యూరిటీ రీసెర్చర్ సంస్థ బయటపెట్టింది. ఫోన్లో సేవ్ అయి ఉన్న పాస్వర్డ్స్ క్రెడిట్ కార్డ్ నెంబర్లు, ఇతర డేటా, బ్రౌజర్లో ఉన్న సమాచారాన్ని దోచేస్తారని వెల్లడించారు.
మనకు తెలియకుండానే..
కాగా, అందరూ అనుకున్నట్లుగా ఏదో యాప్ ఇన్ స్టాల్ చేస్తేనే మన డేటా దొంగిలించడం కుదురుతుందని అనుకోవద్దని, ఎటువంటి ఇన్ స్టాలేషన్ లేకుండానే ఇలాంటి లింకుల ద్వారా మన కీలక సమాచారాన్ని దోచేస్తారని తేలింది. మనం చూస్తున్నంత సేపు కరోనావైరస్ మ్యాప్ లోడ్ అవుతున్నట్లే చూపిస్తుంది.. కరోనా మ్యాప్ యూఆర్ఎల్ కనిపిస్తున్నా.. మీ ఫోన్లోని ఇతర సోర్సుల నుంచి మరో అప్లికేషన్ రన్ అవుతూ డేటాను దోచేస్తుంది.
2016లో తొలిసారి..
ఈ మాల్వేర్ విండోస్ సిస్టంలను అటాక్ చేస్తుందని, ఇందులో వస్తున్న కొత్త వెర్షన్ ఇతర పరికరాలపైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిసింది. ఈ అజోరాల్ట్ గా పిలువబడే ఈ సాఫ్ట్ వేర్ మొదట 2016లో గుర్తించబడటం గమనార్హం. కరోనావైరస్ భయాన్ని ఈ హ్యాకర్లు ఇలా వాడుకుంటుండటంతో ఆయా దేశాలు తమ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇలాంటి లింక్స్, సాఫ్ట్ వేర్ పట్ల ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదన్నమాట.