ఏందయ్యా ఈ దారుణం.. కరోనా హెల్ప్ లైన్కు కాల్ చేసి ఏమడుగుతున్నారో తెలుసా..
కరోనా తీవ్రత గురించి ప్రభుత్వాలు,మీడియా ఎంత నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నా కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఆశీర్వాద్ గోధుమపిండి దొరకట్లేదని ఒకరు.. పాలకూర కట్టలు దొరకట్లేదని ఇంకొకరు.. అత్తగారింటికి వెళ్లాలని మరొకరు.. ఇలా సిల్లీ కారణాలతో రోడ్లపై ఇష్టారీతిన తిరుగుతున్నారు. పోలీసులు లాఠీలతో దండించినా సరే.. ఇంట్లో ఎక్కువసేపు కూర్చోలేక కొంతమంది అలా గాలికి తిరిగొద్దామని బయలుదేరుతున్నారు. ఇంకా ఏ భాషలో చెబితే ఇలాంటివాళ్లు మారుతారు.. దీనికి తోడు మరో కొత్త సమస్య కూడా మొదలైంది. కరోనాపై అవగాహన,నియంత్రణ చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్లకు కూడా కొంతమంది సిల్లీ కారణాలతో ఫోన్లు చేసి విసిగిస్తున్నారు.
సమోసాలు.. తమలపాకులు.. పిజ్జాల కోసం హెల్ప్ లైన్కు..
లాక్ డౌన్ కారణంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారు,అత్యవసర సహాయం కావాల్సినవారు ఫోన్ చేసేందుకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఓవైపు ఢిల్లీ నుంచి స్వస్థలాలకు వస్తున్న వలస కార్మికులకు అందించాల్సిన రేషన్ సప్లై,మరోవైపు రోడ్ల పైకి వచ్చేవారిని కట్టడి చేయడం.. ఇలా రకరకాల పనులతో అడ్మినిస్ట్రేషన్ మొత్తం బిజీగా ఉంది. ఇలాంటి తరుణంలో సిల్లీ కారణాలతో హెల్ప్ లైన్ సెంటర్లకు కాల్స్ రావడం అధికారులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. రాంపూర్కి చెందిన ఓ వ్యక్తి హెల్ప్ లైన్ సెంటర్కు ఫోన్ చేసి.. 'నాకు సమోసాలు తినాలనుంది.. నాలుగు సమోసాలు పంపించండి.' అని చెప్పాడు. మరో వ్యక్తి ఫోన్ చేసి.. 'నా పాన్ షాపులో పాన్ తయారీకి తమలపాకులు అయిపోయాయి. తమలపాకులు పంపించండి.' అని చెప్పారు. ఇంకొకరు ఫోన్ చేసి.. 'నాకు పిజ్జా కావాలి.. ఇప్పుడే పంపించండి.' అని చెప్పారు.
డ్రైనేజీ క్లీన్ చేయించిన అధికారులు
ఇలా సిల్లీ కారణాలతో వస్తున్న ఫోన్లకు అధికారులు విసిగిపోయారు. సమోసా కోసం ఫోన్ చేసిన వ్యక్తిని పిలిపించి.. డ్రైనేజీలు క్లీన్ చేయించారు. విధులకు ఆటంకం కలిగించినందుకు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం మనం అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని.. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ సాయం కావాల్సిన వారికోసం హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ కొంతమంది దీన్ని అర్థం చేసుకోకుండా.. సిల్లీ కారణాలతో ఫోన్ చేయడం సరికాదన్నారు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.ప్రస్తుతం రాంపూర్ హెడ్ క్వార్టర్స్లో ఒకటి.. తహశీల్దార్ బ్లాక్లో మరొకటి.. మొత్తం రెండు హెల్ప్ లైన్ సెంటర్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
అత్యవసరం ఉన్నవాళ్లే కాల్ చేయాలి..
సిల్లీ ఫోన్ కాల్స్ను మినహాయిస్తే.. కొంతమంది సరైన కారణంతో ఫోన్ చేసి తగిన సాయం పొందుతున్నారని చెప్పారు. మెడికల్ సాయం అవసరమైన గర్భిణీలు,ఆరోగ్యం బాగా లేనివారు.. ఇలా సరైన కారణంతో ఫోన్ చేసేవారికి తక్షణ సాయం అందిస్తున్నామన్నారు. వీలైనంతవరకు వారి ఇళ్ల వద్దకే ఫుడ్ లేదా వైద్య సేవలను పంపిస్తున్నామని చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉందని.. కానీ వచ్చే ఫోన్ కాల్స్లో 50శాతం అనవసరపు కారణాలతో,సిల్లీ పనుల కోసం ఫోన్ చేస్తున్నారని చెప్పారు. సమోసాలు,పాన్,పిజ్జాలు వంటి సిల్లీ వస్తువుల కోసం ఫోన్ చేసేవారు.. ఇకనైనా ఆ కాల్స్ తగ్గించుకుంటే ఆపదలో ఉన్నవారు హెల్ప్ లైన్ను ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేశారు.
బయటకొస్తే జరిమానాలు..
ఇక కొంతమంది ఇంట్లో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నామన్న కారణంతో.. వూరికే రోడ్లపై తిరుగుతున్నారని చెప్పారు. ఇలాంటి వారికి జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. అనవసరంగా బయటకొస్తే రూ.500 జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. గత ఐదు రోజుల్లోనే అలా రూ.2లక్షలు జమ చేసినట్టు చెప్పారు. అంతేకాదు,అలాంటివారి ఫోటోలను సోషల్ మీడియాలోనూ పెడుతున్నారు. సమోసాల కోసం హెల్ప్ లైన్కి ఫోన్ చేసిన వ్యక్తితో డ్రైనేజీ క్లీన్ చేయిస్తున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.