భారత్లో కరోనా విలయం: మరో 535 మంది బలి -కొత్తగా 39,742 కేసులు -నిదానంగా వ్యాక్సినేషన్
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉధృతి అదుపులోకి రాకముందే, మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. కొత్త కేసులకు సమానంగా రికవరీలు నమోదవుతున్నాయి. వ్యాక్సినేష్ పై కేంద్రం వాదనకు భిన్నంగా చాలా చోట్ల టీకాల కొరత ఏర్పడింది. వివరాలివి..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు కాగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది.
Recommended Video
నిన్న ఒక్కరోజ కొవిడ్ మహమ్మారికి 535 మంది బలయ్యారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 4,20,551కు పెరిగింది. 4,08,212 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరతపై రిపోర్టులు వస్తున్నా కేంద్రం మాత్రం కొరత లేదని చెబుతోంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న 51,18,210 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 43,31,50,864కి చేరింది. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరం పడే అవకాశముందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.