కరోనా విలయం:వరస్ట్ టాప్-10లో భారత్.. ఢిల్లీ-ఘజియాబాద్ బోర్డర్ మళ్లీ సీజ్.. 4వేలు దాటిన మరణాలు..
లాక్ డౌన్ 4.0 సడలిపుల్లో భాగంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు పున:ప్రారంభమైన సోమవారం నాటికి దేశంలో వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,977 పాజిటివ్ కేసులు, 154 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,845కి చేరగా, మరణా సంఖ్య 4,021కు పెరిగింది. కేసుల్లో సోమవారం నాటి పెరుగుదలతో భారత్.. ప్రపచంలోనే వరస్ట్ టాప్-10లోకి ప్రవేశించినట్లయింది.
కరోనా: ఒకే రోజు 4 మృతి, కొత్తగా 41 కేసులు.. తెలంగాణలో తగ్గని వైరస్ వ్యాప్తి..
జాన్ హోప్కిన్స్, వరల్డో మీటర్ లెక్కల ప్రకారం కరోనాకు తీవ్రంగా ఎఫెక్టయిన దేశాల జాబితాలో సోమవారం నాటికి భారత్ 10వ స్థానానికి చేరింది. కొత్త కేసులు నమోదవుతున్న తీరు ఇదే రకంగా కొనసాగితే కొద్ది రోజుల్లోనే మనం టర్కీ(1.56లక్షల కేసులు)ను కూడా దాటే ప్రమాదముంది. దాదాపు 17 లక్షల కేసులు, 1లక్ష మరణాలతో అగ్రరాజ్యం అమెరికా టాప్ లో కొనసాగుతున్నది. బ్రెజిల్ లో పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారుతోంది. ప్రస్తుతం 3.65లక్షల కేసులు, 22,746 మరణాలతో అది టాప్-2గా ఉంది. 3.53లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ మరణాల సంఖ్య 3,633గా ఉంది.
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో తీవ్రంగా ఉందని తెలిసిందే. ఢిల్లీలో ఒక్కరోజే 635 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం సఖ్య 14వేలు దాటింది. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయలేని దశలో కీలకమైన ''ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దు''ను సోమవారం నుంచి మళ్లీ మూసేశారు. తదుపరి ఆదేశాలు వెలువడేదాకా ఈ సరిహద్దులోకి అత్యవసర విభాగాలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రులకు సీఎం కేజ్రీవాల్ ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. పడకల సౌకర్యం ఉన్న అన్ని ప్రైవేటు ఆస్పత్రులు విధిగా 20 శాతం బెడ్లను కొవిడ్-19 పేషెంట్లకు కేటాయించాలని సీఎం ఆదేశించారు.
కరోనా వ్యాప్తిపై పొలిటికల్ పంచాయితీలు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ నియమాలకు విరుద్ధంగా ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి ఓ స్టేడియాన్ని ప్రారంభించారంటూ ఆప్ నేతలు విరుచుకుపడ్డారు. తాను మాత్రం నిబంధనల్ని ఉల్లంఘించలేదని తివారి వాదిస్తున్నారు. బీజేపీకే చెందిన వివాదాస్పద ఎంపీ పర్వేజ్ వర్మ.. సోనియా గాంధీ ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించి, అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన అలవాటుతో.. కరోనాపైనా ప్రజల్ని ఆగంపట్టిస్తున్నారని, వైరస్ ప్రభావం తగ్గేదాకా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను హొం క్వారంటైన్ లో ఉంచాలని బీజేపీ ఎంపీ అన్నారు.