భారత్లో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 12,059 కేసులు -97.19% రికవరీలు -13 నుంచి మళ్లీ టాకాలు
దాదాపు 15 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి.. వివిధ దేశాల్లో తీరొక్క వేరియంట్లతో అంతకంతకూ విస్తరిస్తోంది. గ్లోబల్గా కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 10.6కోట్లు, మరణాలు 23.2లక్ష్లు దాటాయి. అయితే, భారత్ లో మాత్రం కొత్త ఏడాది ప్రారంభం నుంచి వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆదివారం నాటికి కొత్త కేసులతోపాటు కరోనా మరణాలు భారీగా తగ్గిపోయాయి. వివరాల్లోకి వెళితే..
హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెలువరించిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 6,95,789 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 12,059 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,26,363కి చేరింది. ఇక మరణాల విషయానికి వస్తే..
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 78 మంది కరోనా కాటుకు బలైపోయినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. గడిచిన కొద్ది నెలల కాలంలో ప్రాణనష్టం ఈ స్థాయికి తగ్గిపోవడం ఊరటకలిగిస్తోంది. మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆదివారం వరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,54,996కి చేరింది. భారత్ లో కరోనా మరణాల రేటు 1.43 శాతంగా ఉన్నట్లు సర్కారు పేర్కొంది. ఇక..
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 11,805 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,05,22,601కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.19 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త లెక్కల ద్వారా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,766 కు తగ్గింది. ఇదిలా ఉంటే..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో విడత ప్రక్రియ ఈనెల 13 నుంచి ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ తొలి విడత కార్యక్రమాన్ని జనవరి 16 న మొదలుపెట్టగా, మొత్తం 57,75,322 మంది వారియర్లు టీకా తొలి డోసును తీసుకున్నారు. వీళ్లందరికీ ఫిబ్రవరి 13 నుంచి టీకా రెండో డోసును అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీరం ఇనిస్టిట్యూట్ తయారీ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాలను దేశంలో అత్యవసర వినియోగానికి వాడుతోన్న సంగతి తెలిసిందే. కొత్తగా మరో ఏడు టీకాలు రాబోతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.