భారత్లో కరోనా: సరికొత్త రికార్డు -ప్రపంచంలోనే అత్యధిక రికవరీ రేటు -కొత్తగా 18,139 కేసులు
వ్యాక్సినేషన్ కు సిద్దమవుతోన్న వేళ కొవిడ్ మహమ్మారికి సంబంధించి పాజిటివ్ వార్తలు వెలువడుతున్నాయి. భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందనడానికి రుజువుగా కొద్ది రోజులుగా కొత్త కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పరిస్థితి తీవ్రతను తగ్గించింది..
Recommended Video
భారత్లో కరోనా -కొత్త రకం వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి -యూకే స్ట్రెయిన్ బారిన 73 మంది..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,35,369 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..18,139 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,13,417 కి చేరింది. కొద్ది రోజుల క్రితం 16వేలకు వరకు పడిపోయిన కేసుల సంఖ్యలో నిన్నటి నుంచి కాస్త పెరుగుదల కనిపిస్తోంది.
గడిచిన 24 గంటల్లో 234 మంది కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,50,570కి పెరిగింది. భారత్లో కరోనా కేసులు పెరిగినా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో నమోదవుతుంది. గత 24 గంటల్లోనే 20,539మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 1,00,37,398 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,25,449 యాక్టివ్ కేసులున్నాయి. కాగా..
దేశంలో యాక్టివ్ రేటు 2.16 శాతానికి తగ్గగా..రికవరీ రేటు 96.39శాతానికి పెరిగింది. భారత్లో రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యధికమని ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, రష్యాలో రికవరీ రేటు మెరుగ్గా ఉందని పేర్కొంది.
కొవిడ్ వ్యాక్సినేషన్ కు సిద్ధమవుతోన్న భారత్ లో శుక్రవారం దేశవ్యాప్త డ్రైరన్ కొనసాగుతోంది. 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డమ్మీ టీకాల పంపిణీ ప్రక్రియ నడుస్తోంది. అసలైన టీకాల పంపిణీకి కూడా సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ తేదీలు ఒకటి రెండు రోజుల్లో వెల్లడికానున్నాయి.