కరోనా కేసుల్లో మళ్లీ రికార్డు: కొత్తగా 54వేలు - ట్యాలీ 18లక్షలు, డెత్ టోల్ 37వేలపైనే..
అందరి అంచనాలను తలకిందులు చేసిన కరోనా మహమ్మారి అంతూ పొంతూ లేకుండా వ్యాపిస్తూనే ఉన్నది. ఒక్క జులైలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 11 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఆగస్టు ప్రారంభం నుంచే వైరస్ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,736మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,998,793 (దాదాపు 18 లక్షలకు) పెరిగింది.
రాజధానిపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం - తరలింపునకు ముందే 4 జోన్ల ఏర్పాటు - చైర్మన్లు ఎవరంటే..
4 రోజుల్లో 2లక్షలపైనే..
కరోనా కేసులకు సంబంధించి గడిచిన నాలుగు రోజులుగా భారత్ చిగురుటాకులా వణుకుతున్నది. అన్ లాక్ 2.0, అన్ లాక్ 3.0లో చాలా వరకు ఆంక్షలు ఎత్తేయడంతోపాటు టెస్టుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్త కేసులు భారీగా బయటపడుతున్నాయి. వరుసగా నాలుగు రోజులపాటు 50వేల కంటే పైచిలుకు కేసులు నమోదయ్యాయి. జులై 30న మొత్తం 52,123 కేసులు, జులై 31న అంతకు మించి 55,078 కేసులు రాగా, ఆగస్టు 1న రికార్డు స్థాయిలో 57,118 కొత్త కేసులు వచ్చాయి. ఆగస్టు 2న(ఆదివారం) కూడా కొత్తగా 54,736 కేసులు నమోదయ్యాయి. తద్వారా 4 రోజులు వ్యవధిలోనే 2.19లక్షలమంది ఇన్ఫెక్షన్ కు గురికావడం గమనార్హం.
మరణాల రేటు ఇలా..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 853 మంది కరోనాకు బలైపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 37,364కు పెరిగింది. తద్వారా దేశంలో కరోనా మరణాల రేటు 2.13గా ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఇది 4 శాతంగా ఉందని కేంద్రం పేర్కొంది. రికవరీ రేటులోనూ ప్రపంచ దేశాలకంటే భారత్ మెరుగ్గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 18 లక్షలుకాగా, 65.44 శాతం రికవరీ రేటుతో 11.45 లక్షల మంది ఇప్పటికే కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, యాక్టివ్ కేసుల సంఖ్య 5.67లక్షలుగా కొనసాగుతున్నదని కేంద్రం తెలిపింది.
Recommended Video
హైస్పీడ్ లో కొవిడ్ టెస్టులు..
వైద్య పరికరాలు, టెస్టింగ్ కిట్స్ విరివిగా అందుబాటులోకి రావడంతో దేశంలో కొవిడ్ టెస్టుల వేగం పెరిగింది. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 4.63లక్షల శాంపిళ్లను పరీక్షచేశారు. కరోనా విలయం మొదలైనప్పటి నుంచి ఆగస్టు 1 నాటికి చేపట్టిన టెస్టుల సంఖ్య 2 కోట్లకు(1.98కోట్లు) చేరువైంది. రాష్ట్రాలవారీగా చూస్తే, తమిళనాడు, కర్ణాటకలో మరణాల సంఖ్య గణనీయంగా పెరగ్గా, ఢిల్లీలో అనూహ్యంగా కేసుల డబ్లింగ్ వ్యవధి 50 రోజులకు పెరిగింది. 4.31లక్షల కేసులు, 15,316 మరణాలతో మహారాష్ట్ర టాప్ లో ఉండగా, 2.51లక్షల కేసులు, 4వేల మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది.