ఆ 548 మంది డాక్టర్లు, నర్సులకు కరోనా- కేంద్రం నివేదికలో వెల్లడి....
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, వార్డు బాయ్స్ కు కూడా ఈ మహమ్మారి భారీగా సోకినట్లు కేంద్రానికి అందిన తాజా నివేదికలు వెల్లడించాయి. ఇందులో క్షేత్రస్దాయిలో పనిచేస్తున్న వారితో పాటు వార్డ్ బాయ్ లు, ఇతరులను మినహాయించగా... 548 మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఇప్పటివరకూ వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
ఇప్పటివరకూ కరోనా బారిన పడిన డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి వైరస్ ఎవరి నుంచి సోకిందన్నదీ వెల్లడి కాలేదని కేంద్రం నివేదిక పేర్కొంది. వీరిలో కొందరికి పనిచేస్తున్న ఆస్పత్రుల్లో, మరికొందరికి ఇళ్ల వద్ద సమూహాల నుంచి కూడా వైరస్ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు.
అలాగే వీరంతా వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారే అని తేలింది. ఒక్క ఢిల్లీలోనే 69 మంది డాక్టర్లకి కరోనా సోకినట్లు తాజా నివేదిక వెల్లడించింది. మొత్తం కరోనా బారిన పడిన 548 మందిలో 274 మంది నర్సులే ఉన్నట్లు తేలింది.