లాక్ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్గా 1కోటి దాటిన కేసులు..
సైంటిస్టులు, డాక్టర్లు, ప్రభుత్వాల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి మరింత భయానకంగా విజృంభిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,906 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణకాగా, 410 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5.30లక్షలు, మరణాల సంఖ్య 16వేలు దాటింది. రాబోయే రెండు నెలల్లో కేసులు, మరణాలు భారీగా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగింపు మళ్లీ అనివార్యమైంది.
చైనా హింసపై ప్రధాని మోదీ సంచలనం.. భారత్ సత్తా ప్రపంచానికి తెలుసు.. 2020 చెడ్డ ఏడాది కాబోదంటూ..
ముందుగా మహారాష్ట్ర..
కరోనా కేసులు, మరణాలకు సంబంధించి మోస్ట్ ఎఫెక్టడ్ రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రజలు, మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 1.60లక్షలకు, మరణాల సంఖ్య 7,273కు పెరగడం, వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్త లాక్ డౌన్ మరోసారి విధించబోమని గతంలోనే స్పష్టం చేసిన ప్రధాని మోదీ.. ఆ నిర్ణయాధికారాలను పూర్తిగా రాష్ట్రాలకే విడిచిపెట్టడం తెలిసిందే.
జూన్ 30 తర్వాత కూడా..
‘‘గతంలో విధించిన లాక్ డౌన్ గడువు జూన్ 30తో ముగియనుంది. ఆ తర్వాత అంతా రిలాక్స్ అయిపోవచ్చని ఎవరైనా భావిస్తే పొరపాటే. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా జూన్ 30 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగిస్తాం. అయితే, జులై 1 నుంచి అమలులోకి రానున్న అన్ లాక్ 2.0లో భాగంగా కొన్ని రకాల సేవలకు మాత్రం సడలింపులు కల్పిస్తాం'' అని మహారాష్ట్ర సీఎం చెప్పారు. మహారాష్ట్ర సీఎం అధికారిక ప్రకటన త్వాత మరికొన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ కొనసాగింపు ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో లాక్ డౌన్ మరో 15 రోజులు పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం ఇందుకో నిదర్శనం.
ఉచితంగా రెండెసివిర్ డ్రగ్..
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోన్న వేళ.. కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తూ 'రెమ్డెసివిర్' డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్రలో కొవిడ్ రోగులకు ఈ మందును ఉచితంగా అందించే ఆలోచన చేస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అలాగే, కొవిడ్-19 ట్రీట్మెంట్ లో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలనిస్తోందన్న ఆయన.. ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకున్నవాళ్లు విరివిగా ప్లాస్మా దానాలు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణప్రాంత ప్రజలు కూడా విధిగా మాస్కులు ధరించాలన్నారు. ముంబై సిటీలో కేసుల ఉధృతి నేపథ్యంలో ప్రజలెవరూ తమ ఇళ్ల నుంచి 2.5 కిలోమీటర్లు దాటి వెళ్లరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
సెప్టెంబరు నాటికి 20 కోట్ల కేసులు?
కొత్త కేసుల్లో రోజుకో రికార్డు సాధిస్తోన్న ఇండియా.. రాబోయే రెండు నెలల్లో మరింత గడ్డు కాలాన్ని ఎదుర్కోనుందని, సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 కోట్లు దాటొచ్చని ప్రముఖ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ జయప్రకాశ్ మలీల్ పేర్కొన్నారు. కరోనాపై పోరులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన ‘కొవిడ్ నేషనల్ టాస్క్ఫోర్స్'లో సభ్యుడు కావడంతో మలీల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. దేశ జనాభాతో పోల్చి చూస్తే 20 కోట్ల కేసులు అనేది తక్కువే అయినప్పటికీ, ఆ మాత్రం రద్దీని తట్టుకునే సామర్థ్యం మన వైద్య, ఆరోగ్య రంగానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
100లక్షల కేసులు.. 5లక్షల ప్రాణాలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య ఆదివారంతో 100 లక్షలు(1కోటి) దాటింది. అయితే, ఇందులో సగానికంటే ఎక్కువ మంది(దాదాపు 55 లక్షలు) వ్యాధి నుంచి కోలుకోవడం గమనార్హం. గ్లోబల్ గా వైరస్ కాటుకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 5లక్షలు దాటింది. 26లక్షల కేసులు, 1.28లక్షల మరణాలతో అమెరికా అగ్రభాగాన ఉండగా, 5.30లక్షల కేసులు, 16వేలకుపైగా మరణాలతో ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.
హైదరాబాద్లో మరోసారి లాక్ డౌన్...? 2,3 రోజుల్లో తేల్చనున్న సీఎం కేసీఆర్..