కరోనా విలయం: భారత్ నయా రికార్డు.. రెమ్ డెసివిర్పై సీరియస్ వార్నింగ్.. అభిషేక్ బచ్చన్ కూ వైరస్..
దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి లేదని కేంద్రం, వైద్య వర్గాలు గట్టిగా చెబుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా బయటపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మరో రికార్డు. ఆదివారం నాటి కేసులతో కలిపి, భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 8.5లక్షలకు పెరిగింది. కరోనాకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన దేశాల జాబితాలో మనం అమెరికా(33.55లక్షల కేసులు), బ్రెజిల్(18లక్షల కేసులు) తర్వాత మూడో స్థానంలో కొనసాగుతున్నాం.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా కరోనా కాటుకు గురై 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 22,674కు పెరిగింది. కాగా, భారత్ లో కొత్త కేసులతోపాటు రికవరీ రేటు గణనీయంగా ఉండం ఊరటకలిగిస్తున్నది. ఇప్పటిదాకా 62.78 శాతం రికవరీ రేటుతో 5.34లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు దగ్గరగా ఉంది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో కొవిడ్ మరణాల సంఖ్య 10వేల మార్కు దాటడం విషాదకరం. అక్కడ మొత్తం 2.46లక్షల కేసులు నమోదుకాగా, ఇప్పివరకు 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో, మరీ ప్రధానంగా ముంబై సిటీలో వైరస్ వ్యాప్తి వేగం పెరిగింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కరోనా కాటుకు గురవుతున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకినట్లు శనివారం రాత్రి నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో అమితాబ్ ఈనెల 11న నానావతి ఆసుపత్రిలో చేరారు. ఆదివారం నాటికి బిగ్ బీ కొడుకు అభిషేక్ బచ్చన్ కు కూడా వైరస్ సోకినట్లు కన్ఫామ్ అయింది. దీంతో కుటుంబీకులందరికీ మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు. అమితాబ్, అభిషేక్ లు చికిత్స పొందుతోన్న నానావతి ఆస్పత్రి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని, త్వరలోనే కోలుకుంటామంని బచ్చన్ ఫ్యామిలీ ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే..
Recommended Video
దేశంలో కొవిడ్-19 చికిత్సకు ఎబోలా విరుగుడు మందు 'రెమ్డెసివిర్' వాడటానికి కేంద్రం అనుమతించిన దరిమిలా.. కొన్ని ఆస్పత్రుల్లో ఆ డ్రగ్ ను విచ్చలవిడిగా వాడుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్, ఎయిమ్స్ సంస్థలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. రెమ్ డెసివిర్, టొసిలిజమాబ్ లాంటి డ్రగ్స్ ను కచ్చితమైన నింధనల మేరకు మాత్రవే వాడాలని, ఇష్టమొచ్చినట్లు ఉపయోగిస్తే రోగి కాలేయం, మూత్రపిండాలకు హాని వాటిల్లుతుందని చెప్పింది.