మోడీ కంటే ఓ అడుగు ముందే ఉన్న యోగి: 15 జిల్లాలు అష్టదిగ్బంధనం.. లాక్డౌన్: అర్ధరాత్రి నుంచే
లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ను పొడిగించడంపై కేంద్రప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇస్తోన్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 18వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించడానికి సన్నద్ధమౌతోన్న సమయంలో.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించారు.
మొన్న హెల్మెట్: హైదరాబాద్ రోడ్లపై కరోనా కారు: 100 సీసీ ఇంజిన్.. 40 కిలోమీటర్ల వేగం
యోగి ఆదిత్యానాథ్ మెరుపు నిర్ణయం
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి యోగి ఆదిత్యనాథ్ మెరుపు వేగంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తన రాజకీయ గురువు నరేంద్ర మోడీ కంటే ఓ అడుగు ముందే ఉన్నానని నిరూపించుకున్నారు. కరోనా వైరస్ తీవ్రత, పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న 15 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. 15వ తేదీ అర్ధరాత్రి వరకూ ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీ వెల్లడించారు.
రాజధాని లక్నో సహా..
రాజధాని లక్నో కూడా ఈ 15 జిల్లాల జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. లక్నో సహా ఘజియాబాద్, గౌతమ్బుద్ధ నగర్ (గ్రేటర్ నొయిడా), కాన్పూర్, వారణాశి, షామ్లీ, మీరట్, బరేలీ, బులంద్ షహర్, ఫిరోజాబాద్, మహరాజ్ గంజ్, సీతాపూర్, సహరాన్ పూర్, బస్తీ జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి 15వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలులో ఉంటుందని రాజేంద్ర కుమార్ తివారీ వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ 15 జిల్లాల్లో కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగించే అవకాశం ఉందనీ అన్నారు.
రాకపోకలు బంద్..
ఈ 15 జిల్లాల్లో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయనుంది యోగి సర్కార్. ఆయా జిల్లాల సరిహద్దులను మూసివేయనున్నారు. వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. 15 జిల్లాల మధ్య కూడా వాహనాల రాకపోకలు ఉండబోవని రాజేంద్ర కుమార్ తివారీ చెప్పారు. కరోనా వైరస్ హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని, నిత్యావసర సరుకులను ఇళ్ల వద్దకే సరఫరా చేస్తామని అన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మెడిసిన్ను కూడా ఫోన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి సంఖ్య అధికంగా ఉండటం వల్లే..
దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండటం వల్లే యోగి సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్లో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 60 శాతం వరకు ఢిల్లీ మత ప్రార్థనలతో ముడిపడి ఉన్నవే కావడం, వారంతా ఈ 15 జిల్లాలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.