అమానవీయం : కరోనా పాజిటివ్గా తేలడంతో కనికరం లేకుండా... ఆస్పత్రి బయటే మహిళ ప్రసవం..
జమ్మూకశ్మీర్లో దారుణం జరిగింది. కరోనా సోకిన ఓ గర్భిణీ మహిళను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో... ఆస్ప్రతి గ్రేటు బయటే ఆమె ప్రసవించింది. డాక్టర్లను ఎంతగా ప్రాధేయపడినా కనికరించిన పాపాన పోలేదని ఆమె భర్త వాపోయారు. విషయం తెలుసుకున్న స్థానికుల ఆస్పత్రి ఎదుట నిరసనకు బైఠాయించారు. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... జమ్మూకశ్మీర్ బందిపోర్ జిల్లాలోని వేవన్ అనే మారుమూల గ్రామానికి చెందిన మహిళ 9 నెలల గర్భవతి. శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలకు ముందు కోవిడ్ 19 టెస్టు తప్పనిసరి అని అక్కడి వైద్యులు చెప్పారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో బందిపోరా జిల్లాకు 25కి.మీ దూరంలో ఉన్న హజిన్ ప్రాంతంలోని కోవిడ్ 19 ఆస్పత్రికి ఆమెను తరలించాలని వైద్యులు సూచించారు.
అప్పటికే ఆమెకు నొప్పులు తీవ్రమవడంతో అక్కడే వైద్యం అందించాల్సిందిగా ఆ ఆస్పత్రి వైద్యులను కుటుంబ సభ్యులు బతిమాలారు. కానీ అందుకు వారు ససేమిరా అనడంతో... చేసేది లేక ఆస్పత్రి నుంచి బయటకొచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి గేటు వద్దకు రాగానే ఆమె నొప్పులను భరించలేక అక్కడే కుప్పకూలింది. దీంతో మరోసారి వైద్యుల వద్దకు వెళ్లి ప్రాధేయపడినా లాభం లేకపోయింది. దారిన వెళ్తున్న కొందరు ఆమె పరిస్థితిని గమనించి దుప్పట్లు ఇచ్చారు. దీంతో ఆస్పత్రి గేటు వద్దే కుటుంబ సభ్యులు ఆమె చుట్టూ దుప్పట్లు పట్టుకుని నిలుచుకోగా... ఆమె అక్కడే ప్రసవించింది.
Recommended Video
ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబానికి మద్దతుగా వారంతా ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు దీనిపై విచారణ జరిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. బాధ్యులైన వైద్యుల వేతనాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశాలిస్తామన్నారు. ఇది అమానవీయమైన చర్య అని.. బాధ్యులుగా తేలినవారిని ఉపేక్షించేది లేదని చెప్పారు.