బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు బంద్: డిసెంబర్ 31న కఠిన ఆంక్షలు
బెంగళూరు: కరోనావైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో బెంగళూరు పోలీసులు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు నగరంలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. వేడుకల కారణంగా పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశాలుండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బెంగళూరులో సాయంత్రం నుంచి ఉదయం వరకు ఆంక్షలు
డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1, 2021 ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ వెల్లడించారు. ఎంజీ రోడ్, చర్చి స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్, కోరమంగళ, ఇందిరానగర్ను ‘నో మ్యాన్ జోన్'లుగా ప్రకటిస్తున్నట్లు సీపీ తెలిపారు. నగరంలోని పబ్లు, బార్లు, రెస్టారెంట్లలో ముందస్తుగా రిజర్వేషన్ కూపన్లు తీసుకున్నవారికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
పార్టీలన్నీ బంద్..
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ నివాస సముదాయాల్లోనే నిర్వహించుకోవాలని, ఆ సమయంలో కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మ్యూజికల్ నైట్స్, షోలు వంటి ప్రత్యేక కార్యక్రమాలను మాల్స్, పబ్లు, రెస్టారెంట్లు, క్లబ్ హౌస్లలో అనుమతించబోమని బెంగళూరు కమిషనర్ కమల్ పంత్ తేల్చి చెప్పారు.
కొత్త కరోనా నేపథ్యంలో బహిరంగ వేడుకలు రద్దు
మనదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. కొత్తగా బ్రిటన్లో స్ట్రెయిన్ వైరస్ పుట్టుకురావడంతో మరింత జాగ్రత్తలు అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునేందుకు అనుమతించబోమని ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ఇది ఇలావుంటే, కర్ణాటకలో గత 24 గంటల్లో 653 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 1178 మంది కోలుకున్నారు. మరో 8 మంది మరణించారు. కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,16,909కి చేరగా, 8,92,273 మంది కోలుకున్నారు. మరో 12,070 మంది కరోనాబారినపడి మృతి చెందారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 12,547 యాక్టివ్ కేసులున్నాయి.