హతవిధీ: ఆన్లైన్లో అమ్మకానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ.. ఎంతకో తెలుసా..? ఏం జరిగింది..?
గుజరాత్ : కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు ఆకతాయిలు తమాషాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు వదంతులు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఇందులో 90 శాతం అవాస్తవాలే ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై ప్రభుత్వాలు కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా దేశ సమగ్రతను వివరిస్తూ ఆ రాష్ట్రంలో ఏర్పాటు అయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడు.
ఆన్లైన్లో అమ్మకానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
గుజరాత్ రాష్ట్రంలో కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాగాలేకపోవడం, కరోనాపై పోరుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించడం లేదని చెబుతూ ఓ వ్యక్తి ఏకంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్నే ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేశాడు. నర్మదా జిల్లాలోని కేవాడియా ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహాన్ని రూ.30వేల కోట్లకు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. కరోనా వైరస్ రాష్ట్రంలో విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్సకు కావాల్సిన పరికరాలు, హాస్పిటల్స్కు కావాల్సిన డబ్బుల కోసం విగ్రహాన్ని అమ్మకానికి పెట్టినట్లు పోలీసులు చెప్పారు.దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఓఎల్ఎక్స్లో రూ. 30వేల కోట్లకు..
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం అమ్మకానికి పెట్టినట్లు స్థానిక దినపత్రికలో ఆర్టికల్ రావడంతో అది తమ దృష్టికి వచ్చిందన్నారు పోలీస్ అధికారి పీటీ చౌదరి. ఎపిడిమిక్ డిజీస్ యాక్ట్, ఐటీ చట్టం కింద చీటింగ్ మరియు ఫోర్జరీ కేసును నమోదు చేసినట్లు అధికారి వెల్లడించారు. ఇక ఓఎల్ఎక్స్ వెబ్సైట్ నుంచి ఈ ప్రకటన తొలగించిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వివరణ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పోస్టు చేశాడని చెప్పారు. ఆ అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ పని చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్మినిస్ట్రేటర్. సర్దార్ పటేల్ను ఆదర్శంగా తీసుకున్న కోట్లమంది ప్రజలకు ఇలాంటి ఘటనలు ఆవేదనకు గురిచేస్తాయని ప్రజల సెంటిమెంట్లతో ఆడుకోరాదని అధికారి హితవు పలికారు.
Recommended Video
2018లో ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ
దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన జ్ఞాపకార్థం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో భారీ విగ్రహాన్ని నిర్మించింది మోడీ సర్కార్. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం. ఇప్పటికే ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 2018 అక్టోబరులో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.