కరోనా విలయం: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు.. గరీబ్ కల్యాణ్ పొడగింపునకు ఆమోదం..
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కష్టకాలంలో పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 నెలల పాటు పొడగించే నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం సారాంశాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, నరేంద్ర తోమర్ మీడియాకు వివరించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు.. ప్రతినెలా ఒక్కొక్కరికి 5కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమ పిండి, ఒక్కో కుటుంబానికి 1కేజీ పప్పును ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా కొనసాగుతోన్న ఈ పథకాన్ని నవంబర్ వరకు పొడగిస్తున్నట్లు.. జూన్ 30న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ప్రకటనకు నేటి కేబినెట్ భేటీలో ఆమోదం పడిందని మంత్రి జవదేకర్ తెలిపారు. ఇతర రంగాలకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయాలను తీసుకుంది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కంట్రిబ్యూషన్ను మరో మూడు నెలలు(జూన్ నుంచి ఆగస్టు వరకు) పొడిగించే నిర్ణయానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపిందని జవదేకర్ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.4,860 కోట్ల అదనపు భారం పడినప్పటికీ, 72 లక్షల మంది ఉద్యోగుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
వీటితోపాటు పేదలకు ఇళ్లు అంశానికి సంబంధించి మరో కీలక అంశాన్ని కూడా జవదేకర్ వెల్లడించారు. పట్టణప్రాంతాల్లో వలస కూలీల కోసం ఉద్దేశించిన అర్బన్ రెంటల్ హౌసింగ్ స్కీంకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మాణాలు చేపడతామని, రాష్ట్రాలు ఈ పథకంలో చేరితో కేంద్రం తగిన సాయం అందిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 14న ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇప్పుడు దానికి కేబినెట్ ఆమోదం లభించడంతో ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
అలాగే, పేద మహిళలకు అందించే ఉచిత ఎల్పీజీ సిలిండర్లను కూడా సెప్టెంబర్ వరకు కొనసాగిస్తామని, దీని ద్వారా 7.4 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి జవదేకర్ చెప్పారు. పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలైన ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెట్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లకు రూ. 12,450 కోట్లు పెట్టుబడి సహకారం అందించాలనే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు.