మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్లు -కేంద్రం కీలక ప్రకటన
కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా దేశంలో వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశ టీకాల పంపిణీ పూర్తికాగా, తర్వాతి దశలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని, దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్ అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
దేశంలో మొత్తం 10వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేపడతామని, మరో 20వేల ప్రైవేటు కేంద్రాల ద్వారా కూడా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి జవదేకర్ స్పష్టంచేశారు. ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధరలను కొద్ది రోజుల్లో నిర్ణయించనున్నట్టు తెలిపారు. రెండో దశ వ్యాక్సినేషన్లో 27 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం.
మరోవైపు, దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా పంపిణీ భారీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్ను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 1,07,67,198 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు మొదటి డోసు, 13,98,400 మందికి రెండో డోసు అందించారు.
వ్యాక్సిన్ పంపిణీలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు అందిస్తున్న విషయం తెలిసిందే. 39వ రోజు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2,79,823 మందికి మొదటి డోసు, 1,40,223 మందికి రెండో డోసును అందించినట్టు అధికారులు వెల్లడించారు.