కరోనా వ్యాక్సిన్ డ్రైవ్: 12.7 మందికి టీకా, ఏడో రోజు 2 లక్షలకుపైగా, తెలంగాణ, ఏపీల్లో ఎన్ని వేశారంటే..?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఏడో రోజు కూడా విజయవంతంగా కొనసాగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 2,28,563 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 12.7 లక్షల మందికి టీకా పంపిణీ జరిగినట్లు వెల్లడించింది.
Recommended Video
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో ఏడో రోజు 267 మందిలో ప్రతికూల ప్రభావం కనిపించినట్లు కేంద్రం తెలిపింది. కాగా, తెలుగు రాష్ట్రాల వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,27,726 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. తెలంగాణలో 1,02,724 మంది టీకా వేయించుకున్నారు. అత్యధికంగా కర్ణాటకలో 1,82,503 మంది టీకా వేయించుకున్నారు.
వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు టీకాలు వేసిన లబ్ధిదారుల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 1,27,726, బీహార్లో 63,620, కేరళలో 46,970, కర్ణాటకలో 1,82,503, మధ్యప్రదేశ్లో 38,278, తమిళనాడులో 46,825 ఉన్నాయి. ఢిల్లీలో 18,844, గుజరాత్లో 42,395, పశ్చిమ బెంగాల్లో 80,542 అని తాత్కాలిక నివేదిక పేర్కొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల డ్రైవ్గా పేర్కొనబడిన ఈ టీకా పంపిణీ ప్రక్రియ భారతదేశం జనవరి 16న ప్రారంభమైంది. మొదట హెల్త్కేర్, ఫ్రంట్లైన్ కార్మికులకు టీకాలు వేయడం ప్రారంభించింది. మొదటి రోజు అత్యధిక టీకాలు వేసిన దేశాల్లో మన దేశం రికార్డు సృష్టించింది, 2.24 లక్షల మందికి పైగా షాట్లు అందుకున్నారు.