ఈ నెల 28, 29 తేదీల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్- ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో
కరోనా వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ట్రయల్ రన్ నిర్వహించేందుకు నాలుగు రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనుంది.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశవ్యాప్తంగా ఒకేసారి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఏకకాలంలో జరపాల్సిన పరిస్దితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. ఇదే క్రమంలో ఈ నెల 28, 29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే డ్రై రన్ కోసం ఏపీ, గుజరాత్, పంజాబ్, అసోం రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ డ్రైన్ రన్ సాగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఆదేసాలు అందాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో రెండేసి జిల్లాల చొప్పున, ఐదు సెషన్లలో ఈ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఇందులో ఓ ప్రభుత్వాసుపత్రి, ఓ ప్రైవేటు ఆస్పత్రి, ఓ పీహెచ్సీ, ఓ గ్రామీణ ప్రాంతంలో ఈ డ్రైవ్ జరగనుంది. కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ కోసం ఏపీలోని కృష్ణాజిల్లాను ఎంపిక చేశారు. ఈ నెల 28న వ్యాక్సినేషన్ డ్రై రన్కు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి.