భారత్లో కరోనా వ్యాక్సిన్: ఇంకొద్ది రోజుల్లోనే అందరికీ టీకాలు అందిస్తాం: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్
దేశంలో కరోనా మహమ్మారిని నివారించే దిశగా ప్రజలందరికీ త్వరలోనే వ్యాక్సిన్లు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. రెండో విడత వ్యాక్సిన్ డ్రై రన్ సందర్భంగా శుక్రవారం ఆయన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే అతి తక్కువ సమయంలోనే భారత్ టీకాలను అభివృద్ధి చేసిందని, అతి కొద్ది రోజుల్లోనే దేశ ప్రజలకు ఆ టీకాలను ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలి విడతలో హెల్త్కేర్ ప్రొఫెషనల్స్కు ఆ తర్వాత ఫ్రంట్లైన్ వారియర్లకు టీకాలు అందజేస్తామని హర్షవర్దన్ వెల్లడించారు. మనదేశంలో అత్యవసర వినియోగానికి సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను వినియోగించేందుకు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అనుమతించిన సంగతి తెలిసిందే.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపడుతామని, రాజధానుల స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసేలా చర్యలు చేపట్టామన్నారు. లక్షల సంఖ్యలో హెల్త్కేర్ వర్కర్లకు శిక్షణ ఇచ్చామని, ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్రం మంత్రి తెలిపారు. చెన్నైలో ఆయన పాల్గొన్న మీడియా సమావేశంలో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ విజయ్భాస్కర్ కూడా పాల్గొన్నారు.
ఈనెల 2వ తేదీన దేశవ్యాప్తంగా సుమారు 125 జిల్లాల్లో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించామని మంత్రి హర్షవర్దన్ తెలిపారు. మూడు రాష్ట్రాలు మినహాయించి.. ఇవాళ(శుక్రవారం-జనవరి 8న) కూడా దేశవ్యాప్తంగా రెండో విడత డ్రై రన్ చేపట్టినట్లు మంత్రి గుర్తుచేశారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ఎన్జీవోలు వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ లబ్దిదారులను ఎంపికలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఇక జనవరి 17వ తేదీన దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు పోలియా ఇమ్యునైజేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు హర్షవర్దన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే..
కరోనా వ్యాక్సినేష్లకు విడిగా దేశవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం కూడా ఈ నెల 17 నుంచి మూడు రోజులపాటు ఇమ్యునైజేషన్ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. పోలియో టీకాల పంపిణీ ఈనెల 17 నుంచి ప్రారంభం కానుండగా, కోవిడ్-19 వ్యాక్సినేషన్ మరికొద్ది రోజుల్లోనే మొదలువుతుందని మంత్రి చెప్పారు.