కరోనా గురించి సరికొత్త రహస్యాన్ని వెల్లడించిన చైనా: నాలుగు మీటర్ల వరకు వైరస్ ట్రావెల్ చేస్తుందట
బీజింగ్: ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించిన భయానక కరోనాకు జన్మనిచ్చిన చైనా..ఆ వైరస్ గురించి ఓ సరికొత్త విషయాన్ని వెల్లడించింది. కరోనా వైరస్పై ఆ దేశ శాస్త్రవేత్తలు నిర్వహిస్తోన్న పరిశోధనల సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ క్రమంగా తన బలాన్ని మరింత పెంచుకుందని పేర్కొంది. ఇకపై ఆ వైరస్ నాలుగు మీటర్ల వరకు ప్రయాణించగలదని వెల్లడించింది. నాలుగు మీటర్లు లేదా 13 అడుగుల వరకు ప్రయాణించేలా శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుందని వెల్లడించింది.
Recommended Video
వార్నీ..హైదరాబాద్ యూత్ ఘనకార్యం:ఫుడ్ పాకెట్సే కాదు..మద్యం కూడా: కూలీల కోసం ఖరీదైన లిక్కర్
నాలుగు మీటర్ల వరకు ట్రావెల్
బీజింగ్లోని చైనా అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి వద్ద నుంచి కనీసం నాలుగు మీటర్లు.. అంటే 13 అడుగుల వరకు ట్రావెల్ చేయగలుగుతుందని తెలిపారు. కరోపై నిర్వహించిన పరిశోధనలకు సంబంధించిన వివరాలను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అనే జర్నల్లో ప్రచురించారు. ఈ కథనం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
వుహాన్ ఆసుపత్రి నుంచి శాంపిళ్ల సేకరణ..
తమ పరిశోధనల కోసం అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు వుహాన్ ఆసుపత్రిని ఎంచుకున్నారు. వుహాన్లోని హ్యూషెన్షాన్ ఆసుపత్రిలోని ఐసీయూ, జనరల్ వార్డుల్లో చికిత్స పొందిన కరోనా వైరస్ పేషెంట్లు, అక్కడి శాంపిళ్లను సేకరించి, పరిశోధనలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇదివరకు కంటే కరోనా వైరస్ మరింత బలపడిందని, నాలుగు మీటర్ల వరకు ట్రావెల్ చేయగల శక్తిని సమకూర్చుకుందని నిర్ధారించారు.
కరోనా పేషెంట్ల వార్డులో ప్రతిదీ ప్రమాదకరమే..
కరోనా వైరస్ పేషెంట్లను ఉంచిన ఐసొలేషన్ వార్డుల్లో ఏది ముట్టుకున్నా ప్రమాదకరమేనని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. కంప్యూటర్, చెత్తబుట్టలు, పేషెంట్లను ఉంచిన పడకలకు అమర్చిన రెయిలింగ్స్.. చివరికి డోర్ హ్యాండిల్ను ముట్టుకున్నా వైరస్ సులువుగా మరొకరికి సోకుతుందని ఈ జర్నల్లో రాసుకొచ్చారు. ఫ్లోర్ కూడా ప్రమాదకరంగానే ఉంటుందని రాశారు. అందుకే హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులు.. ఐసొలేషన్ వార్డుల్లో విధులకు హాజరైన సమయంలో శరీరం మొత్తాన్నీ సురక్షితంగా కప్పుకోవాల్సి ఉంటుందని సూచించారు.
సోషల్ డిస్టెన్సింగ్ మరింత
ఈ పరిస్థితుల్లో జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన నిబంధనలను మార్చుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం మనిషికి, మనిషికి మధ్య ఒక మీటర్ దూరాన్ని పాటించడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని ఇదివరకు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీని ఆధారంగానే సోషల్ డిస్టెన్సింగ్ను పాటించాల్సి ఉంటుందనే నిబంధనను ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. తాజా పరిశోధనతో ఈ సోషల్ డిస్టెన్సింగ్ను మరింత నాలుగు మీటర్లకు తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.