కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు.. ముదిరిన వైరస్, పాలిటిక్స్.. మోదీ తప్పులకు మేం బలి కాబోమంటూ..
భారత్లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. లాక్ డౌన్ 4.0లో భారీ సడలింపులు ప్రకటించిన దరిమిలా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కొత్తగా బయటపడుతోన్న పాజిటివ్ కేసులకు సంబంధించి ఆదివారం మరో రికార్డు నమోదుకావడం విచారకరం. గడిచిన 24 గంటల్లో(ఒక్క రోజులోనే) కొత్తగా 6767 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,31,868కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 54,441 మంది వ్యాధి నుంచి కోలుకోగా, మరో 73,560 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా 6వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 147 మంది కరోనాకు బలైపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3867కు చేరింది. పారిశ్రామిక కేంద్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ లో కేసులు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 1577 మంది చనిపోగా, కేసుల సంఖ్య 50వేలకు దగ్గరవుతున్నది. గుజరాత్ లో డెత్ రేటు ప్రమాదకర స్థాయిలో ఉంది. అక్కడ 13,669 కేసులకుగానూ రికార్డు స్థాయిలో 829 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16వేల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నప్పటికీ, మరణాల సంఖ్య 104గా నమోదైంది.
దేశంలో కరోనా కేసుల పెరుగుదలపై కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది. లాక్ డౌన్ నిబంధనల్ని రాష్ట్రాలు సరిగా అమలు చేయనందుకే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా గతవారం రాష్ట్రాల సీఎస్ లకు ఘాటు లేఖ రాయడం తెలిసిందే. కేంద్ర హోం శాఖ లేఖపై చాలా రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ బాహాటంగా మోదీ సర్కారుపై విమర్శలకు దిగారు.
Recommended Video
డొమెస్టిక్ విమాన సర్వీసులను సోమవారం(మే 25) నుంచి పునరుద్ధరించాలంటూ మోదీ సర్కారు చేసిన సూచనపై మహారాష్ట్ర హోం మంత్రి మండిపడ్డారు. ఎయిర్ పోర్టుల్లో సరైన టెస్టింగ్ వసతులు కల్పించకుండా సర్వీసుల్ని ప్రారంభించాలనుకోవడం ప్రమాదకరమని, కేంద్రం తీసుకుంటోన్న నిర్ణయాలకు రాష్ట్రాలు బలికావాల్సిన పరిస్థితి నెలకొందని మంత్రి అనిల్ అన్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ రైళ్లకు తోడు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖా ప్రకటించడం తెలిసిందే.