చిన్న రాష్ట్రం.. ఆదర్శం: రూ.20 వేల కోట్ల కరోనా ప్యాకేజీ: నెలకు రూ.1000 పింఛన్.. రేషన్ ఫ్రీ..!
తిరువనంతపురం: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని కమ్మేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి అన్ని రాష్ట్రాల్లో జనజవనం స్తంభించిపోతున్న వేళ..దీన్ని కట్టడి చేయడానికి స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. బయట తిరగొద్దని, జనతా కర్ఫ్యూ పాటించాలని సూచిస్తున్నారు.
20 వేల కోట్ల కరోనా ప్యాకేజీ..
అక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ.. రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులు, దినసరి వేతన కూలీలు, వ్యవసాయ కూలీల పరిస్థితేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్నన్ని రోజులూ వారు పస్తులు ఉండాల్సి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ పరిస్థితుల్లో రోజువారీ కూలీలు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంది కేరళలోని కమ్యూనిస్టు సర్కార్. ఏకంగా 20 వేల కోట్ల రూపాయల కరోనా వైరస్ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకుని రాబోతోంది కూడా.
కమ్యూనిస్టు సర్కార్ సంచలన నిర్ణయం..
కేరళలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ఈ ప్యాకేజీని ప్రకటించారు. ఈ తరహా ప్యాకేజీని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ.. జనజీవనం స్తంభించిపోవడం వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో.. ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచిందని అంటున్నారు కమ్యూనిస్టులు.
దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి కూడా..
ఈ ప్యాకేజీని వర్తింపజేయడంలో తర, తమ భేదాలను చూడలేదు. ధనిక, పేద వర్గాలు అని విభజన రేఖను తుడిచేసింది. ప్రతి కుటుంబానికీ ఆర్థిక భరోసాను కల్పించేలా చర్యలు తీసుకుంది. వచ్చేనెల 1వ తేదీ నుంచి 1000 రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛను అందించబోతోంది. దీనికోసం 1320 కోట్లను కేటాయించినట్లు పినరయి విజయన్ వెల్లడించారు. కరోనా పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. ఈ నెల నుంచే ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ కింద 500 కోట్లను మంజూరు చేశారు.
రూ.20కే ఆహారం.. వెయ్యికి పైగా హోటళ్లు..
వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా హోటళ్లను ప్రారంభించబోతున్నామని, ఈ హోటళ్ల ద్వారా అతి తక్కువ ధరకు ఆహారాన్ని అందిస్తామని పినరయి సర్కార్ వెల్లడించింది. 20 రూపాయలకే భోజనాన్ని సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. స్థానిక సంస్థలు ఈ హోటళ్లను పర్యవేక్షిస్తాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ఈ హోటళ్ల ద్వారా పేదలకు ఉచితంగా ఆహారాన్ని సరఫరాచేస్తామని తెలిపారు. దీనికోసం 50 కోట్ల రూపాయలను కేటాయించారు.
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ..
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఒక నెల నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తామని పినరయి విజయన్ వెల్లడించారు. గులాబీ రంగు, తెలుపు రంగు కార్డు అనే తేడా ఉండబోదని, రేషన్ కార్డును చూపించి, నిత్యావసర సరుకులను తీసుకెళ్లొచ్చని ఆయన స్పష్టం చేశారు. డ్వాక్రా గ్రూపులకు 2000 రూపాయల వరకు రుణం అందజేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పింఛన్లు పొందని వారికి వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందజేసేందుకు రూ.1320 కోట్లను కేటాయించారు.
Recommended Video
ప్రతిపక్షంతో చర్చించిన తరువాతే.. ఉమ్మడిగా ప్రకటన..
ఈ ప్యాకేజీని ప్రకటించడానికి ముందు పినరయి సర్కార్.. ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యం వహిస్తోన్న యుడీఎఫ్ కూటమి నాయకులతో సమావేశమైంది. వారి సూచనలు, సలహాలను స్వీకరించింది. ఈ ప్యాకేజీలో పొందుపరిచింది. పినరయి విజయన్ ఈ ప్యాకేజీని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల పక్కనే ఉన్నారు. ఆయనతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పినరయి ఈ ప్యాకేజీని ప్రకటించారు.