కరోనా విలయం: మోదీ కీలక యోచన -ఇకపై అంతా వర్చువల్ -అందరికీ టెక్ -చైనా వ్యాక్సిన్
ఏడాది కాలంగా భూగ్రహాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూ పోతున్నది. ఆదివారం భారత్ లో కొత్తగా మరో 45,209 కేసులు, 501 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 91లక్షలకు, మరణాలు 85వేలకు చేరాయి. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6కోట్లకు, మరణాలు 14 లక్షలకు చేరువయ్యాయి.
Recommended Video
కరోనా రెండో, మూడో దశ విజృంభణ కారణంగా పలు దేశాలు మళ్లీ పూర్తి లాక్ డౌన్ లోకి వెళ్లిపోగా, భారత్ లోని కీలక నగరాల్లో తిరిగి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. జనవరిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, అందరికీ అందేనాటికి మరో నాలుగేళ్ల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా విలయం మరింత కాలం కొనసాగడం ఖాయం కావడంతో దేశాలు ఎలా ముందుకెళ్లాలనేదానిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఆలోచనలు, ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచారు.
కొవిడ్-19 వ్యాక్సిన్: మరో 10 రోజుల్లో -'ఎమర్జెన్సీ యూజ్' కోసం ఫైజర్ అభ్యర్థన -ఎఫ్డీఏ ఓకే చెప్పేనా?
జీ20 సదస్సులో మోదీ స్పీచ్..
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా, ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగిన దేశాధినేతల వార్షిక సమావేశమైన ‘జీ20 సదస్సు 2020'లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ ఏడాది సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇస్తుండగా, ఆ దేశ పాలకుల ఆహ్వానం మేరకు మోదీ శనివారం రాత్రి వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొన్నారు. జీ20 నిర్వహిస్తోన్న తొలి అరబ్ దేశంగా సౌదీ రికార్డులకెక్కింది. ‘‘21వ శతాబ్దంలో అందరికీ సమాన అవకాశాలు'' అనే థీమ్ తో ఈ ఏడాది సదస్సు నిర్వహించారు. ఇందులో మోదీ..
ప్రపంచ యుద్ధం తర్వాత పెను సవాలు
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భూగోళం ఎదుర్కొటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్ అని ప్రధాని మోదీ జీ20 సదస్సులో వ్యాఖ్యానించారు. మానవ చరిత్రను మలుపు తిప్పే ఘటన కరోనా విలయం అని, కరోనా అనంతర కాలంలో కొత్త ఆలోచనలతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణ, ఉద్యోగాలు, వాణిజ్య పరిస్థితులను మెరుగుపర్చుకోవడానికి మాత్రమే పరిమితమైపోకుండా, మానవాళి భవిష్యత్తును, భూమాతను కూడా సంరక్షించుకోవడంపై ప్రపంచ దేశాలన్నీ దృష్టిసారించాలన్నారు. తన ప్రసంగంలో మోదీ నాలుగు కీలక ప్రతిపాదనలు చేశారు..
కొవిడ్-19 షాకింగ్: రెమ్డెసివిర్ వాడొద్దు -పీక్యూ జాబితా నుంచి తొలగింపు -WHO కీలక ప్రకటన
వర్క్ ఫ్రమ్ ఎనీవేర్..
కరోనా విలయకాలంలో అన్నిటికంటే ముందుగా పని విధానంలో మార్పులొచ్చాయని, ఎక్కడినుంచైనా పని చేయడం (వర్క్ ఫ్రం ఎనీవేర్) ప్రస్తుతం సాధారణ వ్యవహారంగా తయారైందని, రాబోయే రోజుల్లోనూ కరోనా ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమావేశాలు కూడా ఇకపై వర్చువల్ గానే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకోసం ‘జీ20 వర్చువల్ సెక్రటేరియట్'ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అదేసమయంలో నాలుగు అంశాలపై ప్రపంచం దృష్టి సారించాలని చెప్పారు. నైపుణ్యాలను భారీగా సృష్టించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి సాంకేతికత చేరేలా చూడటం, ప్రభుత్వ విధానాల్లో పాదర్శకత, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిని అనుసరించాలని అన్నారు. కొత్త ప్రపంచ నిర్మాణానికి ఈ జీ20 సదస్సు పునాది కావాలని ఆకాంక్షించారు. మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి పారదర్శకత సాయపడుతుందని అన్నారు.
ప్రపంచానికి చైనా వ్యాక్సిన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగా చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ జీ20 దేశాల సదస్సులో మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి తోడ్పడతామని, కరోనా నేపథ్యంలో పేద దేశాలకు చైనా నిధులిచ్చేందుకు వీలుగా నిబంధనలను సవరిస్తున్నామని జిన్ పింగ్ చెప్పారు. దేశాల మధ్య పరస్పర గౌరవం, సమానత్వం, ప్రయోజనాల ప్రాతిపదికన అందరితో శాంతియుత సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని, బేధాభిప్రాయాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని చైనా చీఫ్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగిన నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ సమర్ధవంతంగా జరిగేందుకు వనరులను ఉపయోగించుకొనేలా ప్రపంచ ఆరోగ్య సంస్థకు మిగతా దేశాలు సహకరించాలని జిన్ పింగ్ కోరారు.