కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నాం: 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు: మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రజా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2020 సంవత్సరం అనేక సవాళ్లను విసురుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదని అన్నారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండానే అనేక చర్యలను తీసుకున్నామని, ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. మాస్క్లు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం గురించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చామని అన్నారు. ప్రారంభంలో ఒక కరోనా ల్యాబొరేటరీతో టెస్టులను ప్రారంభించామని, ఇప్పుడు ఆ సంఖ్య వందల్లో ఉందని అన్నారు.
అమెరికా, భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసగించారు. పలు కీలక అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తోందనే విషయాన్ని ఆయన తన స్పృశించారు. ఈ సమ్మిట్ వల్ల వ్యాపారం, వాణిజ్యం, విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, దౌత్యం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం కొనసాగుతోన్న సంబంధాలు మరింత బలోపేతమౌతాయని అన్నారు.
Recommended Video
కరోనా వైరస్ విసిరిన సవాళ్లను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, అతి తక్కువ మరణాల రేటు నమోదు కావడమే దీనికి నిదర్శనమని మోడీ చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా లాక్డౌన్ పరిస్థితుల్లో 800 మిలియన్ల మంది పేదలకు ఆహార ధాన్యాలను ఉచితంగా సరఫరా చేస్తున్నామని, ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని అన్నారు. వలస కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించామని అన్నారు. 130 కోట్ల మంది ప్రజల ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం దెబ్బకొట్టలేకపోయిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.