భారత్లో కరోనా సెకండ్ వేవ్... 2021లోనూ వెంటాడనున్న వైరస్... ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
భారత్లో కరోనా వైరస్ 2021 వరకూ ఉండే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల సరళిని పరిశీలిస్తే... వచ్చే ఏడాది కూడా కొద్ది నెలల పాటు వైరస్ ప్రభావం ఉండవచ్చన్నారు. 'కరోనా మహమ్మారి 2021 వరకూ ఉండదని చెప్పేందుకు లేదు. అయితే కేసుల సంఖ్య భారీగా కంటే నిలకడగా ఉండే అవకాశం ఉంది.' అని చెప్పారు. ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గులేరియా ఈ వివరాలు వెల్లడించారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ తిరగబెడుతుండటం చూస్తున్నామని... ఇది ఒక రకంగా కరోనా సెకండ్ వేవ్ అని గులేరియా పేర్కొనడం గమనార్హం. అయితే దీనికి చాలా కారణాలున్నాయన్నారు. కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో చాలా జాగ్రత్తలతో వ్యవహరించినవారు సైతం... ఇప్పుడు కాస్త లైట్ తీసుకోవడం మొదలుపెట్టారని అన్నారు. కేసులు తిరగబెట్టడానికి ఇదో ముఖ్య కారణమన్నారు. ఎక్కడిదాకో ఎందుకు... దేశ రాజధాని ఢిల్లీలోనే ప్రజలు మాస్కులు ధరించడం లేదన్నారు. గతంలో మాదిరి మళ్లీ గుంపులుగా చేరుతున్నారని... ట్రాఫిక్ జామ్స్ కూడా పెరిగిపోయాయని.. ఒక రకంగా ప్రీ-కరోనా రోజులు వచ్చేశాయని అన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఇవన్నీ కారణమన్నారు.
ప్రపంచంలో చాలాచోట్ల రీఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని... అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అదేమీ ఆందోళన పెట్టే అంశం కాదన్నారు. ఒక్కసారి కోవిడ్ 19 పేషెంట్లో యాంటీబాడీస్ అభివృద్ది చెందితే... 3 నుంచి 6 నెలల వరకూ తిరిగి అతను కరోనా బారినపడకుండా ఉండే అవకాశం ఉన్నట్లు డేటా చెబుతోందన్నారు.
అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్ భారత్లో అందుబాటులోకి రావచ్చునని అన్నారు. ప్రస్తుతం భారత్లో మూడు వ్యాక్సిన్లు అడ్వాన్స్ స్టేజ్ డెవలప్మెంట్లో ఉన్నాయన్నారు. అయితే ఏ వ్యాక్సిన్ అయినా... అది ఎంత సేఫ్ అన్నదే ముఖ్యమని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేసిందని చెప్పడానికి ముందు... పెద్ద ఎత్తున ట్రయల్స్ జరపాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక గతంలో కంటే టెస్టుల సంఖ్య చాలా పెరిగిందని... ప్రతీరోజూ దేశంలో మిలియన్ కంటే ఎక్కువ టెస్టులు చేస్తున్నారని చెప్పారు. ఎక్కడైతే టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉందో... కచ్చితంగా అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతాయని తెలిపారు.
Recommended Video