షాకింగ్ : పాడెపై మోసుకెళ్తుండగా... ఒక్కసారిగా ఏడుపు... ఆ కోవిడ్ పేషెంట్ చనిపోలేదు...
ఆ వృద్దురాలి వయసు 76 ఏళ్లు... ఇటీవల కరోనా సోకడంతో హోం ఐసోలేషన్లో ఉన్నారు... ఐదు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను కారులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు... కానీ అక్కడ బెడ్ దొరకలేదు... దీంతో చాలాసేపు కారులోనే ఉండిపోయారు... ఇంతలో ఆ వృద్దురాలిలో చలనం లేకపోవడాన్ని గుర్తించారు... ఇక ఆమె చనిపోయిందని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ పాడెపై ఆమెను శ్మశానానికి తరలిస్తుండగా ఒక్కసారిగా ఆమెలో చలనం మొదలైంది... గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది... దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు... ఆమె బతికే ఉందని తెలిసి ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని ముధాలే గ్రామానికి చెందిన 76 ఏళ్ల శకుంతల గైక్వాడ్ అనే వృద్దురాలు కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. హోం ఐసోలేషన్లో ఉన్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గలేదు. ఐదు రోజుల క్రితం ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను బారామతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రిలో బెడ్ దొరక్కపోవడంతో చాలాసేపు కారులోనే ఉండిపోయారు.
ఇంతలో వృద్దురాలి కదలికలు ఆగిపోయాయి... చలనం లేకపోవడంతో ఇక ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. బంధువులకు కూడా ఫోన్లు చేసి విషయం చెప్పారు. ఆపై అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. వృద్దురాలిని పాడె పైకి చేర్చి శ్మశానానికి బయలుదేరారు.కానీ ఇంతలోనే అనూహ్యంగా ఆమెలో చలనం మొదలైంది. ఆ వృద్దురాలు ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఆమె ఇంకా బతికే ఉందని తెలిసి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Recommended Video
నిజానికి ఆ వృద్దురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఇక ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. వైద్యులు ఆమె చనిపోయిందని నిర్దారించక ముందే అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. తీరా ఆమె చనిపోలేదని తెలిసి మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వృద్దురాలు బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక పోలీస్ అధికారి సంతోష్ గైక్వాడ్ తెలిపారు.