జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్- కేంద్రం ప్రకటన- భారీ ఏర్పాట్లు
భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించింది. గతంలో ప్రకటించిన విధంగానే ముందుగా హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో ఐసీఎంఆర్, ఇతర సంస్దల ప్రతినిధులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.
Recommended Video
అమెరికాలో కరోనా మరో స్ట్రెయిన్- బ్రిటన్ వైరస్ కంటే 50 శాతం స్పీడుగా-టాస్క్ఫోర్స్ వార్నింగ్
జనవరి 16 నుంచి టీకా పంపిణీ
భారత్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఈ నెల 16న ప్రారంభం కానుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం ప్రారంభించేలా కేంద్రం షెడ్యూల్ సిద్ధం చేసింది. దాదాపు 30 కోట్ల మందికి తొలి విడతలో టీకాలు ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం, రాష్ట్రాల టాస్క్ఫోర్స్లతో సమన్వయం చేసుకుంటూ ఈ భారీ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ నెల 13, 14,15 తేదీల్లో సంక్రాంతి పండుగ రావడంతో పండుగ ముగియగానే ఈ డ్రైవ్ ప్రారంభించాలని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
తొలిదశలో వీరికే టీకా
తొలిదశలో దాదాపు 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం నాలుగు కేటగిరీల వారికి ఇందులో చోటు కల్పించింది. వీరిలో అందరి కంటే ముందుగా మూడు కోట్ల మందికి పైగా ఉన్న హెల్త్ వర్కర్లతో పాటు ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత 50 ఏళ్లకు పైగా వయసు ఉండి కరోనా బారిన పడిన వారికి ఈ టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తర్వాత 50 ఏళ్ల లోపు ఉండి కరోనా బారిన పడి, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా టీకా ఇవ్వనున్నారు. ఫ్రంట్లైన్ వర్కర్లలో పోలీసులు, వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కూడా ఉంటారు.
అందుబాటులో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు
భారత్లో తయారైన రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్లను ప్రస్తుతానికి సేకరించి కరోనా బాధితులకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాలను కేంద్రం సేకరించి పంపిణీ కోసం రాష్ట్ర్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపబోతోంది. ఇప్పటికే ఈ మేరకు ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. వాటి మేరకు కేంద్రం సూచించిన ప్రాంతాలకు వ్యాక్సిన్ పంపేందుకు ఆయా సంస్ధలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
వ్యాక్సిన్ రవాణాకు భారీ ఏర్పాట్లు..
ఈ నెల 16న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించేందుకు వీలుగా కేంద్రం ఇప్పటికే రెండుసార్లు డ్రై రన్ నిర్వహించింది. అలాగే రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో వ్యాక్సిన్ రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తక్కువ సమయంలో వ్యాక్సిన్ రవాణాతో పాటు దాన్ని నిల్వ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీంతో టీకాను సరైన సమయంలో అందించేందుకు టాస్క్ఫోర్స్ల సాయంతో కేంద్రం సమన్వయం చేయబోతోంది. ఈ ఏడాది ఆగస్టు వరకూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగే అవకాశముంది. రాష్ట్రాల టాస్క్ఫోర్స్లకు ఈ మేరకు కేంద్రం షెడ్యూల్ కూడా పంపినట్లు తెలుస్తోంది.