గోవు తల్లి: కట్జూ వ్యాఖ్యపై ఎస్పీ నేత సయ్యద్ కౌంటర్
లక్నో: ఆవు ఎవరికీ తల్లి కాదన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యల పైన సమాజ్ వాది పార్టీ నేత సయ్యద్ రాజా ఆదివారం నాడు మండిపడ్డారు. గోవు ఎవరికీ తల్లి కాదని, అది అన్నింటిలా ఒక జంతువు అని కట్జూ వ్యాఖ్యానించారు. దీనిపై ఎస్పీ నేత సయ్యద్ రాజా స్పందించారు.
గోవులపై కట్జూ చేసిన వ్యాఖ్యలను సదరు ఎమ్యెల్యే సయ్యద్ రాజా తీవ్రంగా తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలు అవివేకమైనవి, బాధ్యతారాహిత్యమైనవనవన్నారు.
ప్రజల్లోకి ఇవి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అత్యున్నత స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలను ఊహించలేదని, దేశంలో గోవులను మొదటినుంచీ తల్లిగానే భావిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
గోవులను రక్షించిన ముస్లిం యువకులు
లక్నోలో ఆదివారం 60 అడుగుల లోతు గల బావిలో పడిన ఓ గోవును జకీ అనే ముస్లిం యువకుడు సాహసోపేతంగా కాపాడారు. అయిష్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం గోవు ప్రమాదవశాత్తూ బావిలో పడింది. అక్కడ గుమికూడిన వారందరూ అధికారుల సహాయం కోసం ఎదురుచూడసాగారు.
అయితే జకీ వెంటనే బావిలోకి దూకి సహచరుల సహాయంతో గోవును రక్షించారు. దాద్రీలో గోమాంసం తిన్నాడనే ఆరోపణలతో ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకున్నది. శుక్రవారం గోమతీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఓ గోవు మ్యాన్హోల్లో పడటంతో ముస్లిం యువకులు రక్షించారు.
'