ఆవు పేడతో కరోనా తగ్గదు- శాస్త్రీయంగా నిరూపణ కాలేదు.. బీజేపీకి మేఘాలయ గవర్నర్ షాక్..
ఆవుపేడతో కరోనా తగ్గుతుందా అంటే అవుననే అంటోంది పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గోమూత్రం, పేడతో కరోనా తగ్గిస్తామంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ హవాను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ చేస్తున్న ఈ హడావిడిపై ఆ పార్టీకే చెందిన మేఘాలయ గవర్నర్ తథాగత్రాయ్ మండిపడ్డారు.
ఆవుపేడతో కరోనా తగ్గదు, ఇకనైనా పశ్చిమబెంగాల్లో ఈ ప్రచారం ఆపండి అంటూ మేఘాలయ గవర్నర్ తథాగత్రాయ్ తన తాజా ఇంటర్వూలో బీజేపీ నేతలకు చురకలు అంటించారు. ఆవుపేడతో కరోనా తగ్గుతుందని ఎక్కడా శాస్త్రీయంగా నిరూపణ కాలేదన్నారు.
దీంతో గోమూత్రం, పేడతో లబ్ది పొందాలన్న చౌకబారు ప్రచార ఆలోచనను విరమించుకోవాలని ఆయన సొంత పార్టీ నేతలకు తాజాగా అక్షింతలు వేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తన సొంత రాష్ట్రమైన బెంగాల్లో గెలుపు కోసం బీజేపీ పడుతున్న పాట్ల నేపథ్యంలో తథాగత్రాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బెంగాల్లో మా పార్టీకి చెందిన కొందరు నేతలు గోమూత్రం సేవిస్తే కరోనా తగ్గుతుందని, ఆవుపేడతో వైరస్ను నియంత్రించవచ్చని ప్రచారం చేస్తున్న ప్రచారం చేస్తుంటే నవ్వొస్తుందని తథాగత్రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ నేతలకు మంటపుట్టిస్తున్నాయి.
అయితే తన వ్యాఖ్యలు ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకున్నవి కాదని, విధానాల గురించే మాట్లాడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. గోమూత్రం ప్రచారాలు మాత్రం తనను వ్యక్తిగతంగా బాధించాయన్నారు. చివరిగా 2021లో జరిగే బెంగాల్ ఎన్నికల ద్వారా తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు సదరు ఇంటర్వూలో తథాగత్రాయ్ తన మనసులో మాట బయటపెట్టారు.