గోవధ చేసేవారికి దేశంలో స్థానం లేదు: కాంగ్రెస్ సిఎం
హరిద్వార్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి చెందిన, ఇతర నేతలు చాలా మంది గోవధపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన హరీష్రావత్ కూడా వాళ్ల జాబితాలో చేరడం గమనార్హం. గోవధ చేసేవారికి భారత్లో నివసించే హక్కులేదని ఆయన వ్యాఖ్యానించారు. గోవులను ఎవరైతే చంపుతారో.. వాళ్లు ఏమతానికి చెందినవారైనా సరే దేశానికి శుత్రవుల్లాంటి వారని, అలాంటి వాళ్లకు ఈ దేశంలో నివసించే హక్కులేదని తేల్చి చెప్పారు.
తమ రాష్ట్రంలో గోవులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. గోవధకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఆవులను కాపాడేందుకు ప్రత్యేకంగా వాటి కోసం షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఆవులకు కావాల్సిన పశుగ్రాసాన్ని కూడా అందజేస్తున్నామని తెలిపారు.
కాగా, గోవధకు వ్యతిరేకంగా జరిగిన కొన్ని ఘటనలను కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఖండిస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక, దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.
ఇటీవల బిజెపికి చెందిన హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ మాట్లాడుతూ.. దేశంలో ఉండే ముస్లింలందరూ గోమాంసం తినడం వదిలేయాలని సూచించారు. ‘దేశంలో ముస్లింలు ఉండొచ్చు. అయితే వారు బీఫ్ తినడం మానేయాల్సి ఉంటుంది' అని ఖట్టర్ స్పష్టం చేశారు. మనమంతా ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకుంటూ జీవనం సాగించాలని పిలుపునిచ్చారు.