బులంద్ షెహర్ ఘటన వెనక కుట్రదాగి ఉందా..మతఘర్షణలకు ప్లాన్ చేశారా..?
ఉత్తర్ ప్రదేశ్లోని బులంద్ షెహర్ హింసాత్మక ఘటనలో ఓ పోలీసు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ముందస్తు వ్యూహంతోనే హింస చెలరేగేలా చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సోమవారం మహా గ్రామంలో గోవధ జరిగిందన్న ఆరోపణలపై హింస చెలరేగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగి ఆ వెంటనే హింస చెలరేగడంతో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సుబోద్ కుమార్ సింగ్ మృతి చెందాడు. సుబోద్ కుమార్ సింగ్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతోనే ఆయన మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు తెలిపారు. మరో వ్యక్తి సుమిత్ పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు. అయితే అల్లర్లు చెలరేగడం మూలంగా ఇద్దరూ మరణించారనీ... ఆ మరణాలు ఉద్దేశపూర్వకమైనవి కాదని పోలీసులు తెలిపారు.
తెలిసిన వారు ఎవరూ గోవధకు పాల్పడరు: తహసీల్దార్
మహా గ్రామంలో ముందుగా పరిపాలనా విభాగం నుంచి తహసీల్దార్ రాజ్కుమార్ భాస్కర్ ఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ అప్పటికే ఓ ఆవును చంపి దాన్ని చెరుకు పొలాల్లో వేలాడదీశారని చెప్పారు. అయితే ఆవును చంపితే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసని... కాబట్టి అలా తెలిసిన వారు మళ్లీ ఇలాంటి చర్యకు పాల్పడరని చెప్పారు. ఆవును చంపారన్న వార్త పాకగానే... హిందూ యువ వాహిని, శివసేన, బజ్రంగ్ దల్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనలు తెలిపారు. ఆ తర్వాత వారు ట్రాక్టరులో ఆవు మృతదేహాన్ని తీసుకుని నిరసన తెలిపేందుకు బులంద్షెహర్ ఘర్ముకుటేశ్వర్ జాతీయ రహదారిపైకి తీసుకెళ్లినట్లు తహసీల్దార్ రాజ్కుమార్ చెప్పారు. అయితే వారు తీసుకెళ్లకముందే అంటే గ్రామంలోనే వారిని పోలీసులు అడ్డుకుని ఆపారని అయినప్పటికీ వారు వినకుండా ఆవు మృతదేహంతో ముందుకెళ్లినట్లు చెప్పారు. ఇక వందమంది ట్రాక్టర్లో వెళ్లి చింగ్రావతి పోలీస్ పోస్టుకు చేరుకోగానే ఆ గుంపులో మరింత మంది వచ్చి చేరారని చెప్పారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ ఆ సమూహం వినలేదని పైగా ఎదురుదాడి చేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు.
గోవుల మృతదేహాలను గ్రామం దాటించొద్దని చెప్పిన పోలీసులు
బులంద్ షెహర్ జిల్లా కలెక్టర్కు ఉదయం 11 గంటల సమయంలో ఘటనపై సమాచారం అందింది. చింగ్రావతిలోనే 15 నుంచి 20 ఆవుల మృతదేహాలను స్థానికులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. వీటిని ట్రాక్టర్లలో జాతీయరహదారిపైకి తరలిస్తుండగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారని ఈ క్రమంలోనే కొందరు అల్లరి మూకలు అల్లర్లు సృష్టించారని చెప్పారు. అదే సమయంలో రాళ్లు రువ్వడంతో గొడవ మరింత పెద్దదిగా అయ్యిందని చెప్పారు. ఈ క్రమంలోనే సుబోధ్ కుమార్ సింగ్ అల్లరి మూకలను అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా ఆయనపైకి తూటా దూసుకెళ్లడంతో మృతి చెందినట్లు చెప్పారు. సుబోధ్ సింగ్ను వెంటనే హాస్పిటల్కు తరలించి ఉంటే ప్రాణాలతో బయటపడేవారని కానీ అతన్ని తీసుకెళ్లకుండా ఓ గుంపు అడ్డుపడిందన్నారు. కొట్టండి కొట్టండి అంటూ కేకలు వేశారని ఓ వైపు చెట్టు వెనకాల నుంచి రాళ్లు తమపైకి విసురుతుండగా మరో వైపు అంటే చెరుకు పొలాల్లో నుంచి కాల్పుల శబ్దం వినిపిస్తోందన్నారు. ఇదిలా ఉంటే అల్లర్లు సృష్టించింది హిందూ యువవాహినీ, శివసేన, భజ్రంగ్దళ్ కార్యకర్తలే అని పోలీసులు తెలిపారు.
హింసకు పాల్పడ్డ వారిలో యువవాహిని, భజరంగ్దళ్,శివసేన కార్యకర్తలే
ఘటన తర్వాత బయటపడ్డ ఓ వీడియోలో మహా గ్రామస్తులు రాళ్లు రువ్వడం, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడం వంటి దృశ్యాలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో చాలామంది యువవాహినీ, శివసేన భజ్రంగ్దళ్ కార్యకర్తలే అని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే బులందర్ షెహర్ బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు యోగేష్ రాజ్ పోలీసులు చెబుతున్నదాంట్లో నిజం లేదన్నారు. ఘటనా స్థలంలో ముందుగా తామే ఉన్నామని చెప్పిన యోగేష్ రాజ్... పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చింది తామే అన్నారు. హింస జరగకూడదన్న ఉద్దేశంతోనే తాము పనిచేశామని చెప్పారు యోగేష్ .
సుబోధ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన యోగీ
ఇదిలా ఉంటే ఎక్కడైతే ఆవు మాంసం బయటపడింతో ఆ పొలానికి ఎదురుగా ఉండే మరో పొలం యజమాని కూడా ఘటనపై స్పందించారు. ముందురోజు పొలంలో ఎలాంటి మాంసం ఆనవాలు కనిపించలేదని సోమవారం రోజే ఆవు మాంసం కనిపించిందని చెప్పారు. అయితే ఎవరూ ఆవును చంపుతున్నట్లుగా కూడా కనిపించలేదని ముందుగానే ఎక్కడో చంపి మాంసం మాత్రమే వేలాడదీశారని చెప్పారు. ఇదిలా ఉంటే పోలీసు అధికారి సుబోధ్ కుమార్ సింగ్ కుటంబానికి యోగీ సర్కార్ 50 లక్షల పరిహారం ప్రకటించడంతో పాటు ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.