గోవధ: మూడేళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష
హర్యానా: గోవుల సంరక్షణ కోసం హర్యానాలో కొత్త చట్టం తీసుకు వస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ చెప్పారు. గోవధకు పాల్పడినా, తిన్నట్లు తెలిసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గోసంరక్షణ చట్టం అమలు చేసేందుకు బిల్లు రూపొందించామని, దానికి సంబంధించి ఈ నెల 19వ తేదిన నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తరువాత ఈ చట్టం అమలులోకి తీసుకు వస్తామని చెప్పారు.
ఈ చట్టం అమలు చేసిన తరువాత ఎవరైనా గోవధకు పాల్పడినా, తిన్నా, గోవులను విక్రయించినా మూడేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కఠిన కారాగారశిక్షకు గురౌతారని మనోహర్ లాల్ చెప్పారు. ఇప్పటికే ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని అన్నారు.
ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వారిలో ముస్లీం శాసన సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. అదే విదంగా గోవధ నిషేదం బిల్లు తీసుకురావడాని ముస్లీంలు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారని, ఎలాంటి సహాయానికైన తాము సిద్దంగా ఉన్నామని వారు హామి ఇచ్చారని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ తెలిపారు.