ఇక నుంచి ఆవుల వధ.. నాన్ బెయిలబుల్ నేరమే
ముంబై: హిందువులు దైవ సమానంగా భావించే ఆవులను వధించడం ఇక నుంచి నేరమే. అంతేకాదు, ఇది నాన్బెయిలబుల్ నేరంగా పరిగణించబడనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి గోవులను వధించి వాటి మాంసాన్ని ఎగుమతి, దిగుమతి చేస్తున్న వారిపై కఠిన శిక్షలు అమలు చేయనుంది.
మహారాష్ట్రలో ఆవుల వధకు సంబంధించిన ఎనిమల్ ప్రిజర్వేషన్ బిల్లు-1995 సవరణకు ఆమోదం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. తాజా సవరణ ప్రకారం ఆవులను వధించడం నాన్బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది.
ఆవుల వధకు సంబంధించిన అంశంపై భారతీయ జనతా పార్టీ ఎంపి కీర్తి సోమయ్యతోపాటు మరో ఆరుగురు ఎంపీలు ఎనిమల్ ప్రిజర్వేషన్ బిల్లుపై సవరణ చేపట్టాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి బిల్లు లో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమల్ ప్రిజర్వేషన్ బిల్లు-1995 బిజెపి-శివసేన సంకీర్ణ ప్రభుత్వ హయాంలో రూపొందించబడింది.
ఇక నుంచి మహారాష్ట్రలో ఆవులను వధిస్తే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుంది. వీరికి ఐదేళ్లపాటు జైలు శిక్ష లేదా రూ. 10వేల జరిమానా లేదా రెండూ కూడా విధించవచ్చని పశుసంవర్థక శాఖ మంత్రి ఏకనాథ్ ఖడ్సే తెలిపారు. అంతేగాక, ఇక నుంచి ఆవులు, ఎద్దుల అక్రమ రవాణా, మాంసం అమ్మకాలు పూర్తిగా అరికట్టబడతాయని చెప్పారు.