గోవధకు పాల్పడితే.. ఇక యావజ్జీవ జైలు శిక్షే: గుజరాత్ కొత్త చట్టం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసిపోనున్న నేపథ్యంలో ఈమేరకు నేటి ఉదయం గుజరాత్ అసెంబ్లీ 1954నాటి పాత చట్టాన్ని సవరించింది.
అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం గోవధ చట్టాన్ని మరింత కఠినం చేసింది. ఇకనుంచి గోవధకు పాల్పడినా.. గోవులను అక్రమంగా తరలించినా.. యావజ్జీవ ఖైదు పడేలా చట్టాలను సవరించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిసిపోనున్న నేపథ్యంలో ఈమేరకు నేటి ఉదయం గుజరాత్ అసెంబ్లీ 1954నాటి పాత చట్టాన్ని సవరించింది.
సవరించిన యానిమల్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం గోవధ, గోవుల తరలింపులకు పాల్పడినవారికి ఇకనుంచి యావజ్జీవ శిక్ష అమలుకానుంది. చట్ట సవరణలో జరిమానా పరిమితిని కూడా పెంచారు. ఇలాంటి ఉదంతాల్లో ఇంతకుముందు రూ.25వేల జరిమానా విధించగా.. ఇకనుంచి దాన్ని రూ.50వేలకు పెంచుతూ చట్ట సవరణ చేశారు.
ఇటీవల గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దీనిపై పరోక్షంగా స్పందించారు. 'గోవు, గంగ, గీత'రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన ప్రకటించారు. కాగా, గుజరాత్ లో 2011నుంచి గోవధపై, గోవుల తరలింపుపై నిషేధం అమలవుతోంది. ఇప్పుడు ఆ చట్టం మరింత కఠినరూపం తీసుకుంది.
కాగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోను బీజేపీ ప్రభుత్వమే ఉండటంతో.. భవిష్యత్తులో అక్కడ కూడా ఇదే తరహా చట్టాలను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.