ఆధార్..ఇప్పుడు మనుషులకే కాదు, పశువులకు కూడా తప్పనిసరి
ఆధార్.. భారత దేశ పౌరుడిగా గుర్తిస్తూ 12 అంకెల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆధార్ సంఖ్యతో చాలా వరకు ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తోంది. అయితే ఆధార్ సంఖ్యతో వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కుతోందనే వివాదం కూడా తెరపైకొచ్చింది. కోర్టుల్లో కూడా దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలానా వ్యక్తి భారతీయుడు అని చెప్పేందుకు ఆధారే ఆధారమన్నట్లుగా తయారైంది. ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే పరిమితమైన ఆధార్ సంఖ్య ఇకపై పశువులకు కూడా వర్తింపచేయనున్నారు. దీనిపేరు పశు ఆధార్గా నామకరణం చేసింది ప్రభుత్వం. పశు ఆధార్ లేదా నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ (INAPH)ను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు తయారుచేస్తోంది. దీన్ని విజయవంతంగా నిర్వహిస్తే ఆవులు గేదెలకు సంబంధించి అతిపెద్ద డేటా వ్యవస్థ తయారు చేసిన సంస్థగా పశు ఆధార్కే దక్కుతుంది.
మనుషుల్లానే ఆవులకు గేదెలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య
మనుషులకు ఎలాగైతే ఆధార్ రూపంలో గుర్తింపు సంఖ్యను ఇస్తుందో... అలాగే పశు ఆధార్ సంస్థ కూడా దేశంలోని ఆవులకు గేదెలకు ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. ఆ నెంబరు ద్వారా ఫలానా ఆవుకు కానీ గేదెకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక నెంబరు కేటాయించడం వల్ల దేశంలో ఎన్ని ఆవులు బతికి ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయో అనే సమాచారం ఉంటుంది. ఆవులు గేదెలను అక్రమ రవాణా చేస్తుండటం, వాటిని చంపివేస్తుండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికోసం ఓ ప్రభుత్వ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది. మనుషులకు ఎలాగైతే ఆధార్ సంఖ్యను కేటాయిస్తున్నామో.. అలానే ఆవులకు గేదెలకు కూడా ఓ ప్రత్యేకమైనటువంటి నెంబరు కేటాయించాలని ప్రభుత్వ కమిటీ రికమెండ్ చేసింది.
తొలిదశలో 94 మిలియన్ ఆవులు గేదెలకు నెంబర్ కేటాయింపు
ఇక తొలి దశలో పాలిచ్చే 94 మిలియన్ ఆవులు గేదెలకు ప్రత్యేక నెంబరును కేటాయించనున్నారు.ఒక్కసారి ఇది పూర్తయితే ఆ వెంటనే వృషభాలు, దున్నపోతులకు, ఇతర జంతువులకు కూడా నెంబర్లు కేటాయిస్తారు. పశు ఆధార్ సంఖ్యను జంతువుల చెవులకు కట్టేస్తారు. అంటే ఇకపై దానికి కూడా 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ సమాచారంతో జంతువులకు ఎంత దానా అవసరం అవుతుందో, పాల ఉత్పత్తి, వ్యాక్సినేషన్, ఇతర చరిత్ర డేటా తయారు చేసేందుకు ఉపకరిస్తుందని అధికారులు తెలిపారు.ఒక్కసారి పూర్తి సమాచారంను వెబ్సైట్లో పొందుపరిచాకా.. ఇక జంతువుల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుంది.
అత్యధిక పాలఉత్పత్తి దేశాల్లో భారత్ నెంబర్ వన్
ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసే దేశంగా భారత్ తొలిస్థానంలో ఉంది. అయితే జంతువులకు సంబంధిచిన ఆరోగ్య వివరాలు పూర్తి సమాచారం లేకపోవడంతో ఉండాల్సిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. ఇందుకు కారణం ఒక జంతువు బతికే ఉందా లేదా అన్న సమాచారం లేకపోవడమే కారణం అని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 22.3 మిలియన్ గేదెలు మరియు ఆవులకు ప్రత్యేక గుర్తింపు నెంబరును కేటాయించడం జరిగిందని ఆ వివరాలు INAPH డేటా బేస్లో పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు.