"ఐదేళ్ల తర్వాత.. ఆ రెండు పార్టీలు ఒకే గొడుగు కిందకు"
పైగా 1964సమయంలో పార్టీ చీలిపోయినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలు వేర్వేరుగా ఉద్యమాలు కొనసాగించడం ప్రస్తుత రోజుల్లో కష్టతరంగా మారిందన్నారు.
హైదరాబాద్: 1964నుంచి చీలికలు పీలికలుగా విడిపోయిన కమ్యూనిస్టు పార్టీలు.. తిరిగి ఒకే గొడుగు కిందకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో సీపీఐతో సీపీఎం విలీనమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఒకే భావ సారుపత్యతో పనిచేస్తున్నందునా రెండు పార్టీలు సయోధ్యతో ముందుకెళ్తేనే మనుగడ సాధించగలమని ఆయన అన్నారు. పైగా 1964సమయంలో పార్టీ చీలిపోయినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఒకే భావజాలం కలిగిన పార్టీలు వేర్వేరుగా ఉద్యమాలు కొనసాగించడం ప్రస్తుత రోజుల్లో కష్టతరంగా మారిందన్నారు.
రెండు పార్టీలు కలవడం ద్వారా రాత్రికి రాత్రే అద్భుతమేది జరగదని, దీర్ఘకాలంలో ఫలితం మాత్రం ఉంటుందని అభిప్రాయపడ్డారు. లౌకికత్వం, రాజ్యాంగ నిబద్దత వంటి విషయాల్లో రెండు పార్టీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. అయితే పునరేకీకరణకు సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదని పేర్కొన్నారు.
రెండు పార్టీల్లోను విలీనంపై కొంత సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ సీపీఎం నాయకత్వం తమ పార్టీతో చర్చించలేదన్నారు. వచ్చే ఏడాది రెండు పార్టీల మధ్య రెండు ఉన్నతస్థాయి సమావేశాలు ఉన్నందువల్ల.. ఆ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు.